రామోజీ రావుపై ఎసిబి కేసు, ఇద్దరు ఐఎఎస్లపైనా
రామోజీరావును మొదటి నిందితుడిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఉషోదయా ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ను రెండో నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. రామోజీరావుకు సహకరించిన ఐఎఎస్ అధికారులు ఎస్పీ ప్రసాద్,త కెవి రావుల పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. విశాఖపట్నంలోని ఈనాడు కార్యాలయ స్థలం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఎసిబి విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఎసిబి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీలోగా నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సిఐయు చీఫ్ కె. సంపత్ కుమార్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఈనాడు కార్యాలయం ఉన్న స్థలాన్ని మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి 1974లో రామోజీరావు లీజుకు తీసుకున్నారు. అందులో కొంత భాగం రోడ్డు విస్తరణకు వెళ్లింది.
దానిపై రామోజీరావు భూయజమానికి సమాచారం ఇవ్వకుండా రోడ్డు విస్తరణకు వెళ్లిన భూమికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటల్రల స్థలాన్ని తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. దానిపై భూయజమాని వర్మ ఎసిబి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ వ్యవహారంపై ఎసిబి కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.