మాదన్నపేట, సైదాబాద్లలో కొనసాగుతున్న కర్ఫ్యూ
కర్ఫ్యూ కారణంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరంగా వెళ్లే వ్యక్తులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. ప్రధాన రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇళ్లలో నుండి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. పరీక్షలు, ఇతర అత్యవసరాలు ఉన్న వ్యక్తులకు పోలీసులు అనుమతిస్తున్నారు.
గుర్తింపు కార్డులు చూసి పంపిస్తున్నారు. ఉదయం హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కర్ఫ్యూ ప్రకటిత ప్రాంతంలో సందర్శించారు. పరిస్థితులను ఆమె తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు.
కాగా శనివారం రాత్రి నుండి మాదన్నపేటలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఇరువర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలు బస్సులు ధ్వంసమయ్యాయి. పలువురికి కత్తి పోట్లు కూడా పడ్డాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం కర్ఫ్యూ విధించారు. డిజిపి దినేష్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ ఎకే ఖాన్ ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించారు.