సిపిఎం రథసారథి ప్రకాష్ కారతే, మూడోసారి
పదవీ కాలాన్ని ప్రభుత్వంలోనూ పార్టీలోనూ మూడు పర్యాయాలకు పరిమితం చేస్తూ కోజికోడ్లో జరిగిన పార్టీ ప్రతినిధుల సభ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పదవులు చేపట్టడానికి నాయకులకు వయోపరిమితిని విధించాలనే విషయాన్ని పార్టీ కాంగ్రెసు పరిగణనలోకి తీసుకోలేదు. పార్టీ సమావేశాల్లో నాలుగింట మూడొంతుల మంది సభ్యులు ఓటేస్తే కార్యదర్శి నాలుగో పర్యాయం కొనసాగడానికి వీలుగా నిబంధనావళిని సవరించారు.
ప్రకాష్ కారత్ 1948 ఫిబ్రవరి 7వ తేదీన బర్మాలోని లెత్పదాన్లో జన్మించారు. బ్రిటిష్ పాలనలో ఆయన తండ్రి బర్మా రైల్వేలో పనిచేశారు. వాస్తవానికి కారత్ మలయాళీ. ఆయన చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో విద్యనభ్యసించారు. టోక్యో ఒలింపిక్స్పై నిర్వహించిన వ్యాస రచనల పోటీల్లో ఆయన దేశంలోనే ప్రథమ బహుమతి సంపాదించారు. దాంతో 1964 ఒలింపిక్స్ను వీక్షించడానికి అవకాశం లభించింది.
ప్రకాష్ కారత్ తన పార్టీ సహచరురాలు బృందా కారత్ను వివాహమాడాడు. బృందా కారత్ లండన్లోని ఎయిర్ ఇండియా కార్యాలయంలో పనిచేశారు. ఆ తర్వాత ఆమె సిపిఎం పూర్తి స్థాయి శ్రేణిలో చేరారు. ఆమె పార్టీ పోలిట్బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. బృందా కారత్ది పశ్చిమ బెంగాల్. వారికి పిల్లలు లేరు. ప్రకాష్ కారత్ పార్టీలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వచ్చారు. ఆయన పలు రాజకీయ వ్యాసాలు రాశారు.