'వైయస్'పై రెచ్చగొడుతున్నారు, అది కుట్ర: గోనె ప్రకాశ్
వైయస్ లాంటి వ్యక్తిని విమర్శించడం సరికాదన్నారు. ఉప ఎన్నికలు జరిగే పద్దెనిమిది నియోజకవర్గాలలోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. మంత్రి పదవి కోసం అప్పుడు వైయస్ భజన చేసిన నేతలు ఇప్పుడు కిరణ్ భజన చేస్తున్నారని మండిపడ్డారు.
కొండ్రు మురళిది అదే నైజమన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మరో ముఖ్యమంత్రి వస్తే ఆయన భజన చేసేందుకు కూడా కొండ్రు సిద్ధంగా ఉండారని ఎద్దేవా చేశారు. విశాఖలో రూ.150 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కొట్టేసిన ఘనుడు కొండ్రు అన్నారు.
ఆయనకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఆ భూమిని వారికే పంచాలని సవాల్ చేశారు. ఏనాడూ దళితుల కోసం మాట్లాడని కొండ్రు ఇప్పుడు మాట్లాడటం వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి హయాంలో దళితులకు ఎంతమేర కేటాయించారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ విషయంలో హరిజన నేతలను రెచ్చగొట్టి కాంగ్రెసు దుష్ప్రచారం చేస్తోందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెసు పార్టీయే నష్ట పోతుందని మరో నేత జూపూడి ప్రభాకర రావు తిరుపతిలో అన్నారు. పదే పదే వైయస్ను దళిత నేతలు విమర్శించడం సరికాదన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.