అందాల సుందరి విదేశాంగ మంత్రి రబ్బానీపై వేటు?
గిలానీ ఇటీవల తన లాహోర్లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొత్త టీమ్ కాశ్మీర్ తదితర విషయాలపై భారత్తో సంప్రదింపులు జరుపుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. దీన్ని బట్టి రబ్బానీ శాఖ మారడం ఖాయమనే అభిప్రయానికి వస్తున్నారు. కొత్త టీమ్ ఏమిటనేది మీడియా ప్రతినిధులు అడుగలేదు. దానిపై అంతకు మించి సంభాషణ జరగలేదు.
విదేశాంగ ఉప మంత్రి థామస్ నీడేస్తో కూడిన ప్రతినిధి బృందం పాకిస్తాన్ సందర్శించినప్పుడు రబ్బానీ జర్దారీతో విభేదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏప్రిల్ 4వ తేదీన లాహోర్లోని గవర్నర్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చికాగోలో మేలో అఫ్ఘినిస్తాన్పై జరిగే సదస్సులో పాకిస్తాన్ పాల్గొనే విషయాన్ని నీడేస్ ప్రస్తావించారు. వాషింగ్టన్ ఆహ్వానం పంపితే తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని జర్దారీ చెప్పారు.
పాకిస్తాన్ - అమెరికా సంబంధాలపై కొనసాగుతున్న సమీక్ష కోసం పార్లమెంటు ఉభయ సభల సమావేశం వరకు ఆగాల్సిన ఆవసరం లేదని రబ్బానీ మధ్యలో జోక్యం చేసుకుని అన్నారు. రివ్యూ తర్వాతనే చికాగో సమావేశంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రబ్బానీ ప్రత్యామ్నాయ వాదనను పాకిస్తాన్ అధ్యక్షుడి సమక్షంలో తేవడం అమెరికా ప్రతినిధులను కూడా ఆశ్చర్యపరిచింది.
నవంబర్లో 24 మంది పాకిస్తాన్ సైనికలు మృతికి కారణమైన క్రాస్ బోర్డర్ నాటో వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ - అమెరికా సంబంధాలపై ప్రభుత్వం సమీక్షకు ఆదేశించింది. వచ్చే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సమయంలో రబ్బానీ తన మంత్రిత్వ శాఖను కోల్పోక తప్పదనే ఊహాగానాలు అప్పటి నుంచే సాగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వెంటనే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేయాలని గిలానీ, ఇతర పిపిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.