తెలంగాణ వస్తే అందరికీ హ్యాపీ: బొత్స ట్విస్ట్
పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు ఎంతైనా అవసరమని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండేందుకు సంక్షేమ కార్యక్రమాలను చేపడతామన్నారు. తాము చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళతామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
తెలంగాణ ఇస్తే అందరికీ సంతోషమే కదా అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలంగాణపై తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసు పరిష్కారం కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బొత్స చెప్పారు.
కాగా ఉప ఎన్నికల కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముందని పురపాలక మంత్రి మహీధర్ రెడ్డి రాజమండ్రిలో చెప్పారు. జనాభా గణన పూర్తయిన 45 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు.
నగర పంచాయతీలకు రూ.2 కోట్ల చొప్పున కేంద్ర నిధులు మంజూరయ్యాయన్నారు. జవహర్ లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధి పథకం రెండో దశలో రాజమండ్రికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బిఆర్ఎస్, బిపిఎస్ ఉపయోగించుకొని వారిపై భారీ అపరాధ రుసుమును విధిస్తామని ఆయన తెలిపారు. వారి నుంచి 10 నుంచి 20 శాతం వరకు భూమి విలువలో ప్రతీ సంవత్సరం అపరాధ రుసుము వసూలు చేస్తామని చెప్పారు.