బాబుకు ఝలక్, టిఆర్ఎస్లోకి మాజీ డిజిపి పేర్వారం
తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలను నిరోధించి, భరోసా ఇచ్చేందుకే తాను తెరాసలో చేరుతున్నట్లు పేర్వారం చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని తెరాస ఎప్పటికీ సజీవంగా ఉంచుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని సజీవంగా ఉంచాల్సిన అవసరముందని అందుకే తాను తెరాసతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడ్డట్లు చెప్పారు.
కాగా పేర్వారం రాములు వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన వారు. ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యది పేర్వారంది ఒకే గ్రామం. పేర్వారం తెలుగుదేశం పార్టీ హయాంలో డిజిపిగా పని చేశారు. 2003లో పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగారు.
2008వ సంవత్సరం వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరె కులస్తుల సంక్షేమ సంఘాల్లో అడపాదడపా పని చేస్తున్నారు. తాజాగా ఆయన తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు.