షారూఖ్ ఖాన్కు అమెరికాలో మరోసారి అవమానం
షారూఖ్తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా ఉన్నారు. నీతా అంబానీ కూతురు యేల్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఒక ప్రైవేట్ విమానంలో ప్రయాణించి న్యూయార్క్ విమానాశ్రయంలో దిగిన షారూఖ్ను సెక్యూరిటీ సిబ్బంది రెండు గంటలకు పైగా విచారించారు. దీనిపై షారూఖ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇమిగ్రేషన్ అధికారులు ప్రతి ఒక్కరి విషయంలో వెంటనే క్లియరెన్స్ ఇచ్చారు. అయితే షారూఖ్ను మాత్రం ఆపేశారు. రెండు గంటల పాటు నిలిపేసిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు షారూఖ్కు క్లియరెన్స్ ఇచ్చారు. యేల్ విశ్వవిద్యాలయం అధికారులు హోమ్ల్యాండ్ సెక్యూరిటీని, వాషింగ్టన్లోని కస్టమ్స్ డిపార్టుమెంటును సంప్రదించిన తర్వాత షారూఖ్ను నిర్బంధించిన విషయం తెలిసిందని అంటున్నారు.
రెండు గంటల పాటు షారూఖ్ ఖాన్ను నిర్బంధంలో ఉంచుకున్నందుకు అమెరికా కస్టమ్స్, సరిహద్దు భద్రతా యంత్రాంగం క్షమాపణ చెప్పింది. షారూఖ్ ఖాన్ నిర్బంధాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ తీవ్రంగా పరిగణించారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ వర్గాల దృష్టికి తేవాలని ఆయన అమెరికాలోని భారత దౌత్యవేత్త నిరుపమా రావుకు సూచించారు. నిర్బంధించడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం అమెరికా అధికారులకు అలవాటుగా మారిందని, ఇది కొనసాగడానికి వీలు లేదని ఆయన అన్నారు.
నెవార్క్ విమానాశ్రయంలో 2009లో షారూఖ్కు ఇదే రకమైన అనుభవం ఎదురైంది. అప్పుడు కూడా రెండు గంటల పాటు విచారించిన తర్వాత షారూఖ్ ఖాన్ను వదిలేశారు. అప్పుడు ఈ విషయంపై తీవ్ర వివాదం చెలరేగింది.