వేరే అమ్మాయితో చాట్, కుట్ర: టెక్కీ భర్తపై గోపీప్రియ
తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని, తాను మాత్రం విడాకులు కోరుకోవడం లేదని ఆమె చెప్పింది. తమను ఎస్పీ శ్యాంసుందర్ ప్రత్యేకంగా ఏమీ చూడలేదని ఆమె చెప్పారు. కార్తిక్ తండ్రి పలుకుబడి గల వ్యక్తి కాబట్టి కేసును తనపై నెట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించింది. కేసును తప్పు దోవ పట్టించేందుకు సిఐకి 15 లక్షలు ఆఫర్ ఇచ్చారని ఆమె ఆరోపించింది. హైకోర్టులో తప్పుడు కేసు వేశారని ఆమె ఆరోపించింది.
జనవరి 26వ తేదీన తన తండ్రితో కలిసి తాను మొదటిసారి ఎస్పీని కలిశానని, అంతకు ముందు సిఐని కూడా తన కుటుంబ సభ్యులతో పాటు కలిశానని ఆమె చెప్పింది. తనపై మంత్రులు కూడా ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది. డిటెక్టివ్ను పెట్టి తనను వేధించారని ఆమె చెప్పింది. తమ తండ్రే ఎస్పీకి ఫోన్ చేశారని, తాను చేయలేదని ఆమె అన్నారు.
కార్తిక్ ఆరోపణలపై ఎస్పీ శ్యాంసుందర్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను తన ఆఫీసు ఫోన్ నెంబర్తో కాల్ చేశానని, తనకు వేరే ఉద్దేశం ఉంటే తన వ్యక్తిగత ఫోన్తో కాల్ చేసేవాడినని ఆయన అన్నారు. కార్తిక్ తండ్రి ఐటి ఆఫీసరు కావడంతో కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించారని, ఇటువంటి కేసుల పట్ల తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఆయన చెప్పారు. గోపీ ప్రియ కుటుంబ సభ్యులంతా తనతో మాట్లాడేవారని ఆయన అన్నారు. కార్తిక్పై కేసు వేస్తానని ఆయన అన్నారు. తన బదిలీకి, ఈ కేసుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.
కార్తిక్ ఆరోపణలపై తమ అధికారులు కూడా నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. బాధితురాలికి సాయం చేయడం తప్పా అని ఆయన అడిగారు. తన సర్వీసులో ఇప్పటి వరకు తనపై మచ్చలేదని ఆయన అన్నారు. చట్టప్రకారమే వ్యవహరించానని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలు పోలీసు అధికారులతో పాటు శ్యాంసుందర్ కూడా బదిలీ అయ్యారు. కేసుతో శ్యాంసుందర్ బదిలీకి సంబంధం లేదని, సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీ జరిగిందని డిజిపి కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
కార్తిక్ మాటల్లో నిజం ఉందని తాను నమ్మానని ఆయన తరఫు న్యాయవాది సంజీవ రెడ్డి అన్నారు. కార్తిక్ చెప్పిన మాటల్లో నిజాయితీ ఉందని ఆయన అన్నారు. పగలూ రాత్రీ ఎస్పీ గోపిప్రియ సెల్కు ఎందుకు ఫోన్ చేశారని ఆయన అడిగారు. ఈ కేసుపై ఎస్పీ పైఅధికారులకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని ఆయన అడిగారు. తెలుగు టీవీ చానెల్ ఎస్పీ శ్యాంసుందర్తో మాట్లాడి వివరణ తీసుకుంది. అలాగే, కార్తిక్ తరఫు న్యాయవాది సంజీవరెడ్డితో కూడా మాట్లాడించింది. కార్తిక్పై గోపీప్రియ వరకట్నం వేధింపుల కేసు పెట్టారు. దీంతో వివాదం తలెత్తింది. ఈ వ్యవహారమంతా గుంటూరు జిల్లాకు చెందింది.