రాహుల్ గాంధీ 'బ్రాహ్మణ' వ్యాఖ్యలు, బిజెపి మండిపాటు
మైనారిటీ, బిసి కార్డును ప్రయోగించడం ద్వారా యుపి ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న కాంగ్రెస్ కలలు కల్లలు కావడంతో పార్టీలోని బ్రాహ్మణ నాయకులు తమ స్వరాన్ని తీవ్రం చేశారట. కాంగ్రెస్కు గతంలో అండగా నిలిచిన అగ్రకులాల వారిని ముఖ్యంగా బ్రాహ్మణులను పార్టీ దూరం చేసుకొందని వారిని తిరిగి దరి చేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక నేత ఒకరు ఈ సమీక్షా సమావేశంలో అన్నారు. సదరు నేత ఈ వ్యాఖ్య చేయగానే రాహుల్ గాంధీ తీవ్ర స్వరంతో బ్రాహ్మణులు, అగ్రకులాల వారు కాంగ్రెస్కు దూరం కాలేదని చెప్పేందుకు ప్రయత్నించారట.
తాను బ్రాహ్మణుడినని, పార్టీలో ప్రధాన కార్యదర్శినని రాహుల్ ఒకింత ఆవేశంతో అన్నారట. యుపిలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన బ్రాహ్మణులు, అగ్రకులాల వారిని కాంగ్రెస్ ఇప్పుడు నిర్లక్ష్యం చేసిందన్న వాదన సరికాదని చెప్పేందుకే రాహుల్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
ఉత్తర ప్రదేశ్లో బ్రాహ్మణులు పదిహేను శాతానికి పైగా ఉన్నారు. మొదట వారు కాంగ్రెసు పార్టీ వైపు ఉన్నారు. ఆ తర్వాత గత ఎన్నికలలో మాయావతి వారిని తమ పార్టీ వైపుకు లాక్కుంది. 2007 ఎన్నికల్లో మాయావతి ఎక్కువ మంది బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇచ్చి వారికి తమ పార్టీలో న్యాయం జరుగుతుందని చెప్పారు. దీంతో అప్పుడు వారంతా ఆమెకే ఓటు వేశారు. అయితే మాయా అధికారంలోకి వచ్చాక తమకు ఎలాంటి న్యాయం జరగక పోవడంతో వారు ఇటీవలి ఎన్నికలలో ఎస్పీ వైపు మొగ్గు చూపారు.
అయితే వీరిని మళ్లీ తమ వైపుకు రప్పించుకునే ఉద్దేశ్యంలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాహుల్ బ్రాహ్మణ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. యుపి ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెసు సహనం కోల్పోయిందని, అందుకే రాహుల్ ఇప్పుడు తన కులం పేరు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కులం పేరు చెప్పుకోవడం హద్దులు దాటడమే అన్నారు. యుపి ఎన్నికల్లో కాంగ్రెసు మతతత్వ రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు.