బీఫ్ ఫెస్టివల్: దాని వెనక చాలా కథే ఉంది
ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసిన కంచ ఐలయ్య దళిత సంస్కృతి గురించి, శూద్ర సంస్కృతి గురించి పుంఖానుపుంఖంగా వ్యాసాలు రాస్తూ వచ్చారు. ఆయన రాసిన వై ఐ యామ్ నాట్ ఎ హిందూ (నేనెట్ల హిందువునత) అనే పుస్తకం అప్పట్లో ఒక సంచలనం. ఆయన ప్రతి సందర్భంలోనూ హిందూ సంస్కృతిని వ్యతిరేకించడానికి క్రైస్తవ, ముస్లిం సంస్కృతిని మెచ్చుకుంటూ వచ్చారు.
విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన శివసాగర్, బిఎస్ రాములు వంటి రచయితలు, మేధావులు కూడా దాన్ని ప్రచారం సాగించారు. సంస్కృతిలో విలువలను, ప్రతీకలను తిరిగేసి చెబుతూ వచ్చారు. రాముడికి బదులు రావణుడ్ని.. సంస్కృతిలో ప్రతి నాయకులుగా ముద్ర పడినవారిని నాయకులుగా చేసి మాట్లాడుతూ వస్తున్నారు. వామపక్ష భావజాలంతో ఉన్న మేధావులు కూడా దళితవాదాన్ని బలపరుస్తున్నారు. వామపక్ష భావజాలంతో ఉండి, ప్రస్తుతం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కోదండరామ్ వంటివారు కూదా దళిత అనుకూల వైఖరి తీసుకున్నారు. అంటే, అగ్రవర్ణాల మేధావులు కూడా దళిత దృక్పథానికి అనుకూలంగా మారారు.
కవిత్వంలో తొలుత వచ్చిన మార్పు క్రమంగా సమాజంలో పాదుకుపోయింది. అన్ని ఉద్యమాలకు మాదిరిగానే దళిత ఉద్యమానికి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలం కేంద్రంగా మారింది. తెలంగాణ ఉద్యమంతో అట్టుడుకుతూ వచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పుడు దళిత, దళిత వ్యతిరేక ఉద్యమంతో అట్టుడకడం యాదృచ్ఛికమేమీ కాదు.
నిజానికి, పల్లెల్లో దళితులు గొడ్డు మాంసం తింటారు. కొంత అగ్రవర్ణ శూద్రులు కూడా తింటారు. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో అది చర్చనీయాంశం కూడా కాకుండా పోయింది. కానీ ఉస్మానియా రెండు విరుద్ధ భావజాలాలకు కేంద్రంగా మారడంతో ఈ పరిస్థితి వచ్చింది. మొదటి నుంచి ఉస్మానియాలో ఈ రెండు విరుద్ధ భావజాలాలు సంఘర్షిస్తున్నాయి. అయితే, అవి దాడులకు, హత్యలకు దారి తీసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వామపక్ష భావజాలానికి ప్రాతినిధ్యం వహించి జార్జి రెడ్డి హత్య నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు పలు హత్యలు జరిగాయి.
వామపక్ష ఉద్యమం చీలికలు పేలికలు కావడంతో హిందూ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తుందని భావించే ఎబివిపి ఆధిపత్యం వహిస్తూ వస్తోంది. అయితే, ఒకప్పుడు వామపక్ష ఉద్యమం బలంగా ఉండేది. ఇప్పుడు దళిత ఉద్యమం బలంగా తయారువుతోంది. విశ్వవిద్యాలయాల్లో దళిత, బిసి, మైనారిటీ వర్గాల పిల్లలే ఎక్కువగా చేరుతుండడం, అగ్ర వర్ణాల పిల్లలు సాంకేతిక విద్యలకు మళ్లి ప్రైవేట్ విద్యాసంస్థలకు, సాఫ్ట్వేర్ వంటి రంగాల్లోని ప్రైవేట్ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఇది దళితోద్యమం ఉస్మానియాలో బలం పుంజుకోవడానికి కారణం.