బీఫ్ ఫెస్టివల్: ఉస్మానియా వర్శిటీ రణరంగం
బీఫ్ ఫెస్టివల్కు వ్యతిరేకంగా ఎబివిపి ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ జరిగింది. వారంతా వైస్ చాన్సలర్ ఛేంబర్ను ముట్టడించారు. బీఫ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం హాస్టళ్లలో పాత మెనూనో అమలు చేస్తామని విసి చెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. దాడికి పాల్పడినవారిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
హాస్టళ్లలో బీఫ్ వడ్డించాలని డిమాండ్ చేస్తూ దళిత, వామపక్ష విద్యార్థి సంఘాలు ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాయి. బీఫ్తో వివిధ రకాల వంటకాలు చేశారు. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కొంత మంది ప్రొఫెసర్లు కూడా హాజరయ్యారు. ఇరు వర్గాల విద్యార్థులు పరస్పరం రాళ్లతో, కర్రలతో దాడి చేసుకున్నారు.
తెలంగాణ విద్యార్థి సంఘం, ప్రగతిశీల విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐలు ఈ బీఫ్ ఫెస్టివల్ను నిర్వహించాయి. పెద్దకూర (బీఫ్) తమ సాంస్కృతిక అస్తిత్వంలో భాగమని నిర్వాహకులు వాదిస్తున్నారు. దీంట్లో పోషకాహార విలువలు కూడా దండిగా ఉంటాయని వారు చెబుతున్నారు. విశ్వవిద్యాలయం హాస్టళ్లలోని ఫుడ్ ఫాసిజాన్ని వ్యతిరేకించడమే తమ ఉద్దేశ్యమని వారంటున్నారు.
తమకు ఫలానా ఆహారం కావాలని అడిగే హక్కు విద్యార్థులకు ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్, జర్నలిజం విభాగం మాజీ ఆచార్యుడు పిఎల్ విశ్వేశ్వర రావు అంటున్నారు. ఫెస్టివల్లో పాల్గొన్న విద్యార్థులకు భద్రత కల్పించడంలో విశ్వవిద్యాలయాధికారులు, పోలీసులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
విశ్వవిద్యాలయంలోకి వెళ్లే దారులను పోలీసులు మూసేశారు. అదనపు బలగాలను, పారా మిలిటరీ బలగాలను విశ్వవిద్యాలయంలో మోహరించారు. ఎబివిపి సోమవారం విశ్వవిద్యాలయం బంద్ను పాటించింది. సోమవారం ఆందోళనకారులు ఓ బస్సును దగ్ధం చేసినట్లు సమాచారం.