ఒయు ఘర్షణ తర్వాత మరిన్ని బీఫ్ ఫెస్టివల్స్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గత ఐదేళ్లుగా ఇటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇతర విద్యార్థి సంఘాల మద్దతుతో, రాష్ట్రవ్యాప్తంగా దళితవాద ఆచార్యుల సహకారంతో విస్తృతంగా బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్స్కు దాదాపు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
ఉస్మానియాలోని బీప్ ఫెస్టివల్కు కొంత మంది ఫ్రొఫెసర్లు, విప్లవవాదులు హాజరయ్యారు. వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా దళిత విద్యార్థి సంఘాలతో దాని నిర్వహణలో పాలు పంచుకున్నాయి. గతంలో కూడా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఎబివిపి దాన్ని అడ్డుకుంది. ఎబివిపి కార్యకర్తలు దాడి చేసి వంటకాలను పారేశారు.
ఉస్మానియా, హైదరాబాద్, ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయాల్లోని పలువురు విద్యార్థులు బీఫ్ తింటారని, అది తమ హక్కు అని దళిత విద్యార్థులు అన్నారు. తమ ఆహారపు అలవాట్లను కాపాడుకోవాల్సిన అవసరం తమకు ఉందని వారు చెబుతున్నారు. తమ సాంస్కృతిక, సంప్రదాయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి ఫెస్టివల్స్ నిర్వహించడం తప్పేమీ కాదని వారు చెబుతున్నారు.