రక్షణ శాఖది కాదు: ఆదర్శ్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్
ఆదర్శ్ కుంభకోణంపై ఇద్దరు వ్యక్తులతో కూడిన ప్యానెల్ విచారణ జరుపుతోంది. ఈ ప్యానెల్ తన నివేదికను గత శుక్రవారం కేబినెట్కు అందజేసింది. ఈ నివేదికను మంగళవారం అసెంబ్లీలో ఉంచారు. ఆ భూమి కార్గీల్ యుద్ద వీరులకు, కార్గీల్ అమరవీరుల భార్యలకు కేటాయించింది కాదని ప్యానెల్ తన నివేదికలో తెలిపింది. బాంబే హైకోర్టు మాజీ జడ్జి జెఏ పాటిల్, మాజీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పి.సుబ్రహ్మణ్యంతో కూడిన ప్యానల్ దీనిపై విచారణ జరుపుతోంది.
కోలాబాలో నిర్మించిన 31 అంతస్థుల భారీ భవనం ఉన్న ఈ స్థలాన్ని కార్గిల్ అమరవీరులకు కేటాయించారు. అయితే అదే స్థలంలో ప్రభుత్వం భారీ భవంతిని నిర్మించింది. కార్గిల్ అమరవీరులకు కేటాయించిన భూమిలో అంత పెద్ద భవనం నిర్మించడంపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా భవనంలో కార్గిల్ అమరవీరులకు ఇళ్లు కేటాయించక పోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పాటు వాతావరణ అనుకూలతకు వ్యతిరేకంగా ఉందనే విమర్శలు వచ్చాయి.
ప్రతిపక్షాలు, ఇతర ప్రజా సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ్ సొసైటీపై ఓ ప్యానెల్ను వేసి నివేదిక ఇవ్వమని సూచించింది. అయితే ఈ కేసును విచారణ చేస్తున్న సిబిఐ మాత్రం ఈ స్థలం కార్గిల్ అమరవీరులదేనని చెబుతోంది. ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని అంటోంది. ఆరు అంతస్తులు మాత్రమే కట్టాలనే నిబంధన ఉన్న చోట 31 అంతస్తులు కట్టడం తప్పని చెబుతోంది.
కాగా ఆదర్శ్ కుంభకోణం జాతీయ స్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆదర్శ్ సొసైటీలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఓ ముఖ్యమంత్రి పదవీచ్యుతుడయ్యాడు. పలువురు అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. పలువురు అధికారులు అరెస్టయ్యారు. ఈ భవనంలో పలువురు మాజీ మంత్రులు ప్లాట్లు పొందారనే ఆరోపణలు ఉన్నాయి.