తిట్టుకున్నారు, తోసుకున్నారు: ఎమ్మెల్యే వర్సెస్ టిడిపి
దుర్గ గుడి ఫ్లైవోవర్ నిర్మాణంపై బుద్దా వెంకన్న వెల్లంపల్లిని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇరువురు తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. ఆపై తోసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేలా ఉందని గమనించిన పోలీసులు వెంటనే కలుగజేసుకొని టిడిపి నేత బుద్దా వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రజాపథంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటకు దారి తీయడం అక్కడ కలకలం సృష్టించింది.
కాగా ప్రజాపథంలో ప్రజల నిలదీత మంగళవారం కూడా కొనసాగింది. ఒంగోలు ప్రజాపథంలో అధికారులకు ఓ మహిళ ఝలక్ ఇచ్చింది. మరాఠీపాలెం నారాయణ పాఠశాలలో జరిగిన ప్రజాపథంలో పావలా వడ్డీ కింద ఆమె చెక్కు తీసుకుంటూనే అధికారులు, పాలకులపై విమర్శలు చేసింది. త్వరలోనే కాంగ్రెసు పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించడం అధికారులను ఖంగుమనిపించింది.
కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం పెద్దంపేటలో గ్రామస్థులు ప్రజాపథాన్ని అడ్డుకున్నారు. సాగునీటి సమస్యలపై వారు అధికారులను నిలదీశారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేదంటూ పలువురు మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిని నిలదీశారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం దుబ్బగుర్తిలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. కాగా సోమవారం రాష్ట్రంలోని పలుచోట్ల మంత్రులు, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్న ప్రజాపథాన్ని ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.