సరూర్నగర్ 6 మృతదేహాల గుర్తింపు, ఒకే కుటుంబం
అమరావతి, కరుణావతిలు అరుణావతి చెల్లెల్లు. ఒక అరుణావతికే పెళ్లయింది. ఆమె చెల్లెళ్లకు పెళ్లి కాలేదు. ఈమెకు ముగ్గురు పిల్లలు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అరుణావతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు ఆసిఫ్ నగర్లో గత కొంతకాలంగా ఉంటున్నారు.
ఉస్మాన్ గంజ్లో పని చేస్తున్నారు. మృతుల్లోని ఓ మహిళ వద్ద దొరికిన టెలిఫోన్ డైరీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. అందులో దొరికిన పలు నెంబర్లకు పోలీసులు ఫోన్లు చేసి వివరాలు అడిగారు. ఎట్టకేలకు చివరకు అవి ఎవరివో కనుగొన్నారు. మొదట అవి ఒరిస్సా లేదా బీహార్కు చెందినవిగా అనుమానించారు. ఆ తర్వాత విచారణలో అవి మెదక్ జిల్లా వాసులవి అని తేలింది.
మృతి చెందిన వారంతా ఐదు రోజుల క్రితం తాము బయటకు వెళుతున్నామని చెప్పి ఇంట్లో నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది. వారు అందరూ ఎందుకు మృతి చెందారో ఇంకా కారణాలు తెలియరాలేదు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా బుధవారం హైదరాబాదులోని సరూర్ నగర్లో ఆరు మృతదేహాలు నీటిలో బయటపడిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారు అందరూ ఆడవారే ఉన్నారు.
వారిలో ముగ్గురికి ముప్పై నుండి నలభై ఏళ్ల వయస్సు ఉండగా, మరో ముగ్గురికి ఏడు నుండి పదేళ్ల వయస్సు ఉంది. వారి మృతదేహాలు సరూర్ నగర్ చెరువులో తేలాయి. శవాలు పూర్తిగా ఉబ్బిపోయి ఉన్నాయి. దీంతో మూడు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావించారు.
మృతదేహాల కాళ్లు, చేతులు ప్లాస్టిక్ తాడుతో కట్టి ఉంది. దీంతో హత్య కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నారు. సరూర్ నగర్ చెరువులో మృతదేహాల విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు అక్కడకు భారీగా తరలి వచ్చారు. వారు వేసుకున్న బట్టల ద్వారా ఎవరో తేలుతుందని పోలీసులు చెప్పారు. ప్లాస్టిక్ తాడుతో కట్టి ఉండటం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.