వైయస్కు ముందుచూపు లేదు, ఇదో నిదర్శనం: మర్రి
ప్రజాపథంలో ప్రజలు గృహనిర్మాణ పథకం గురించి నిలదీస్తున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ముందు చూపు లేకుండా పోవడమే ఇందుకు కారణమన్నారు. వైయస్ వందల ఎకరాల విలువైన భూములను సెజ్లకు కట్టబెట్టి నగరంలోని పేదలకు ఇళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు. స్థలం లేకుండానే రాజీవ్ గృహకల్ప, స్వగృహ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రవేశ పెట్టడంతో ఇబ్బందులు వచ్చాయని వివరణ ఇచ్చారు.
గతంలో సికిందరాబాద్లో ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో రాజీవ్ గృహకల్ప పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారన్నారు. ప్రస్తుతం మాత్రం ఇళ్లు నిర్మించేందుకు స్థలం లేక ఇక్కట్లు ఎదురవుతున్నాయన్నారు. వైయస్కు ముందు చూపులేకుండా పథకాలు ప్రారంభించారనడానికి ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు.
కాగా ఇప్పటికే పలువురు మంత్రులు వైయస్ పైన తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొండ్రు మురళీ మోహన్, బస్వరాజు సారయ్యలు వైయస్ దళిత వ్యతిరేకి అని, తనను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ మావాడే అని చెబుతున్నప్పటికీ నేతలు మాత్రం ఆయనపై విమర్శలు మానటం లేదు. కాగా వైయస్కు ముందు చూపు లేదన్న మర్రి శశిధర రెడ్డి ఆయన ఉండగానే స్వర్గీయ పి.జనార్ధన్ రెడ్డితో కలిసి వ్యతిరేకంగా పోరాడారు.