బొత్స ఇలాకాలో టెన్షన్, ఏ క్షణంలోనైనా బాబు అరెస్ట్!
కలెక్టరేట్ పరిసరాల్లోని రోడ్లు అన్నింటిని బ్లాక్ చేశారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరంలో 144వ సెక్షన్ విధించారు. కలెక్టరేట్ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. టియర్ గ్యాస్ వాహనాలు సిద్ధంగా ఉంచుకున్నారు. విజయనగరం వెళ్లే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎక్కడికి అక్కడ అడ్డుకునేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక గేటు వద్ద కాంగ్రెసు, మరో గేటు వద్ద తెలుగుదేశం పార్టీ ధర్నా చేయనుంది.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ కార్తికేయ అన్నారు. అవసరమైతే అరెస్టులకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. టిడిపి నేతలు కూడా ధీటుగానే స్పందించారు. అరెస్టులు, అవాంతరాలు ఎదురైనా ధర్నా చేసి తీరుతామని టిడిపి సీనియర్ నేత అశోక గజపతి రాజు అన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు మద్యం దుకాణాలు ఉన్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మరో నేత ఎర్రన్నాయుడు అన్నారు.
కాగా టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విశాఖ నుండి విజయనగరంకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. విశాఖలో దిగిన ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు. లిక్కర్ సిండికేటుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. బొత్స ఇంట్లో, ఆఫీసుల్లో పని చేసే వారి పేర్ల పైన మద్యం దుకాణాలు ఉన్నాయని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించాల్సిన ఎస్పీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాడని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అధికారానికి దాసోహం అన్న అధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఇంత పనికిమాలిన ఎస్పీను తాను చూడలేదన్నారు. లా అండ్ ఆర్డర్ ఏమాత్రం మెయింటెయన్ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో అసమర్థ సిఎం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఎలాంటి పరిణామాలు జరిగినా దానికి సిఎం బాధ్యత వహించాలన్నారు.
కాగా అంతకుముందు విశాఖలోని ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది, టిడిపి నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో ఎయిర్ పోర్టు సెక్యూరిటీ కార్యాలయం అద్దాలు పగిలాయి, ఎమ్మెల్యే రామకృష్ణ బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో టిడిపి నేతలు ఆందోళన చేశారు.
మరోవైపు భారీ కాన్వాయ్తో విశాఖ వెళుతున్న చంద్రబాబును బత్తెనపాలెం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాబు వాహనం ఒక్క దానినే ముందుకు అనుమతించారు. మిగతా టిడిపి నేతల వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమను అనుమతించాల్సిందేనంటూ రోడ్డుపై బైఠాయించారు. కాగా చంద్రబాబును విజయనగరంకు వెళ్లనీయకుండా ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆయనను బోయపాలెం వద్ద అడ్డుకోవడంతో టిడిపి నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.