ఉప ఎన్నికల షెడ్యూలు రిలీజ్, గందరగోళంలో కాంగ్రెస్
ఉప ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తర్జన భర్జనకు తెరపడింది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి చెప్పగా, ఆగస్టు వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు చూచాయగా చెప్పిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా షెడ్యూలు ఈసి విడుదల చేయడంతో చర్చకు తెరపడింది.
నర్సన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం, పోలవరం, నర్సాపురం, పత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం, రాయదుర్గం, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డతో పాటు తెలంగాణ ప్రాంతంలోని పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
గత సంవత్సరం డిసెంబరులో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చందిన పదహారు మంది శాసనసభ్యులపై స్పీకర్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన శోభా నాగి రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఆమెపై వేటు పడలేదు. ఇక చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది.
సిబిఐ ఎఫ్ఐఆర్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్నదని మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ మీరా కుమార్ ఆయన రాజీనామాను ఆమోదించారు. కాగా ఉప ఎన్నికలు ఇప్పుడప్పుడే జరగనవే భావనతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నేతలు ఇన్నాళ్లూ ఉన్నారు.
అయితే ఈసి అనూహ్యంగా షెడ్యూలు విడుదల చేయడంతో నేతలు గందరగోళంలో పడ్డారని అంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఎండాకాలం నీటి ఇక్కట్లు, కరెంట్ కోతలు ఇలా పలు సమస్యలు ఉన్న సమయంలోనే ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల కావడం వారికి మింగుడు పడటం లేదని అంటున్నారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు దాదాపు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతున్నాయి. కానీ కాంగ్రెసు మాత్రం కొన్ని స్థానాలలోనే అభ్యర్థులను ఖరారు చేసుకుంది. అది కూడా బహిరంగంగా ఇప్పటి వరకు ప్రకటించింది లేదు. షెడ్యూలు విడుదలతో జగన్, చంద్రబాబు తమ వ్యూహాలకు సాన పెట్టనున్నారు.