సస్పెన్షన్: డ్రామా అన్న నామా, సరికాదన్న కెసిఆర్
కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణపై ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సొంత పార్టీ సభ్యులను సభ నుండి గెంటి వేయడం అప్రజాస్వామికమని కెసిఆర్ మండిపడ్డారు. సొంత పార్టీ సభ్యులను గెంటి వేసిన కాంగ్రెసును తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతం నుండి గెంటి వేయడం ఖాయమని అన్నారు.
ఇచ్చిన హామీపై, ప్రజాస్వామ్యయుతంగా అడుగుతున్న ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే పార్లమెంటును, తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించినందుకు కాంగ్రెసు పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు తెలంగాణపై డ్రామా ఆడుతున్నారని నామా నాగేశ్వర రావు ఆరోపించారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ నోటీసు ఇస్తే కాంగ్రెసు ఎంపీలను సస్పెండ్ చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది విడ్డూరమన్నారు. అధిష్టానం, ఎంపీల నాటకానికి ఇది ఓ ఉదాహరణ అన్నారు. ప్రధాన సమస్యను పక్కదారి పట్టించేందుకే వారు ఇలా చేస్తున్నారని విమర్శించారు.