ఇంటర్ ఫిజిక్స్ పేపర్: తప్పు లేదన్న మంత్రి పార్థసారథి
అదనపు మార్కులు కలిపేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదని, ఫేయిల్ అయిన విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయవచ్చని, అయితే సప్లమెంటరీ పరీక్షలో విద్యార్థులు పాసవ్వాలని మంత్రి తెలిపారు. అప్పుడు అకడమిక్ ఇయర్ కోల్పోరని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో వచ్చిన పేపర్ ఆధారంగా పలు విద్యా సంస్థలు విద్యార్థులను ప్రిపేర్ చేశాయని చెప్పారు. అది సరికాదన్నారు.
పాఠ్య పుస్తకాన్ని ఆసాంతం అవగతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్ బోర్డుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన సూచించారు. మొత్తం 21వ ప్రశ్నలలో పదహారు ప్రశ్నల బ్లూ ప్రింట్లోనివే అన్నారు. మిగిలిన కొన్ని ప్రశ్నలు మాత్రమే పుస్తకం నుండి ఇచ్చినట్లు చెప్పారు. ప్రశ్నా పత్రం సరిగా లేదనడం సరికాదన్నారు. ఇక నుండి ఇంటర్ బోర్డు పాఠ్య పుస్తకాల నుండే ప్రశ్నలు ఇస్తుందని చెప్పారు.
2008 నుంచే బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నలు ఇచ్చే సంస్కృతి పోయిందన్నారు. ఇక టెక్స్ట్ బుక్స్కే ప్రాధాన్యం అని చెప్పారు. పరీక్షలో సిలబస్లో లేని ప్రశ్నలు అడగలేదని, కావాలంటే నిరూపించేందుకు సిద్ధమన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందకుండా తదుపరి పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. కాగా అంతకుముందు పార్థసారథి ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించారు.