కొంపముంచిన ఫిజిక్స్: ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన
తొమ్మిది వందలకు పైగా మార్కులు వచ్చినప్పటికీ ఫిజిక్స్లో పదమూడు, పదకొండు మార్కులే రావడం వల్ల ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నలు 2000 సంవత్సరంలోనే తీసి వేశామన్న మంత్రి పార్థసారథి వ్యాఖ్యలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంసెట్ వెయిటేజ్ దృష్ట్యా ఫిజిక్స్ సబ్జెక్టులో వెంటనే మార్కులు కలపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ తల్లిదండ్రులకు మద్దతు పలికింది. వెంటనే మార్కులు కలపాలని డిమాండ్ చేసింది. కాగా మంగళవారం సెకండియర్ ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
తొమ్మిది వందలకు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు ఫిజిక్స్లో ఫెయిల్ కావడం వల్ల పదకొండు మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఎనిమిది వందలకు పైగా మార్కులు వచ్చిన వారిలో పదిహేడు వందలు, ఏడువందలకు పైగా మార్కులు వచ్చిన వారిలో ఎనిమిది వేలకు పైగా, ఆరువందలకు పైగా మార్కులు వచ్చిన వారిలో దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు ఫిజిక్స్ పేపర్ కారణంగా ఫెయిల్ అయ్యారు.
మిగిలిన సబ్జెక్టులలో కూడా ఫెయిల్ అయిన వారు ఉన్నప్పటికీ ఫిజిక్స్ వల్ల ఫెయిల్ అయిన వారి సంఖ్య కంటే అది చాలా చాలా తక్కువగా ఉంది. కాగా పరీక్షల సమయంలో ఫిజిక్స్ పేపర్ చూసినప్పుడే విద్యార్థులు నీరుగారి పోయిన విషయం తెలిసిందే. ఫిజిక్స్ లోనే ఫెయిల్ అవుతామని చాలామంది చెప్పారు.