కృష్ణ సతీమణి విజయనిర్మలకు మినహాయింపు: సిబిఐ
శ్రవణ్ గుప్తాను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును సిబిఐ కోరింది. విల్లాలను అధికర ధరకు విక్రయించడం వల్ల భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్కొంది. నేరపూరిత కుట్రలో సునీల్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని తేల్చింది. వారు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వెల్లడించింది. రికార్డుల్లో చూపిన దానికంటే అధిక ధరకు విల్లాలను విక్రయించడం ద్వారా నిందితులు రూ. 167.29 కోట్ల ప్రయోజనం పొందారని తెలిపింది.
కుట్ర వల్ల ఎపిఐఐసికి రూ.43.50 కోట్లు నష్టపోయిందని చెప్పింది. సునీల్ రెడ్డి, విజయ రాఘవ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, పరారీలో ఉన్న ఎమ్మార్ ఎంజిఎఫ్ ఎండి శ్రవణ్ గుప్తా అరెస్టుకు వారంట్ జారీ చేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. సునీల్ రెడ్డికి చెందిన సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్ సంస్థలోకి 2009-10 మధ్య కాలంలో రూ.45.21 కోట్ల నిధులు వచ్చాయని సిబిఐ అధికారులు తేల్చారు.
దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులైన బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రమణ్యం, కెవి రావు తమ హోదాను దుర్వినియోగం చేసి ఎమ్మార్ ప్రాపర్టీస్కు సహకరించారని సిబిఐ ఆరోపించింది. 2005-10 మధ్య కాలంలో కోనేరు రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ రంగా రెడ్డి, అతని మేనేజర్ శ్రీనివాస్ కలిసి విల్లాల కొనుగోలుదారుల నుంచి 96.01 కోట్ల రూపాయల అదనపు మొత్తాన్ని వసూలు చేశారని, దీన్ని సునీల్ రెడ్డి తీసుకెళ్లారని తెలిపింది.
ఈ విషయాన్ని ద్రువీకరిస్తూ రంగారావు, శ్రీనివాస్ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే వివిధ సెక్షన్ల కింద సునీల్రె డ్డి శిక్షకు అర్హుడేనని చెప్పింది. ఎపిఐఐసి ప్రయోజనాలను దెబ్బతీయటంలో శ్రవణ్ గుప్తా కీలకపాత్ర పోషించారని, విల్లాల ధరలు ఖరారు చేయకుండా పది కొత్త కంపెనీలను సృష్టించినట్లు సిబిఐ తెలిపింది. భవిష్యత్లో అధిక ధరలకు విక్రయించుకునేందుకు వీలుగా ఈ కంపెనీల పేరు మీద విల్లాలను బుక్ చేశారని చెప్పింది.
ఇందుకోసం అనేక కంపెనీలను సృష్టించారని, ఈ కంపెనీల ఏర్పాటుకు అయిన ఖర్చు మొత్తాన్ని మరో కంపెనీ భరించిందని, ఇందులో శ్రవణ్ గుప్తా, అతని భార్యకు 99 శాతం వాటాలు ఉన్నాయని తేల్చింది. 2009-10లో ఎమ్మార్ ఎంజిఎఫ్ సంస్థ 13 ప్లాట్లను అధిక ధరలకు విక్రయించినా, రికార్డుల్లో మాత్రం గజానికి ఐదువేల రూపాయలుగానే చూపారని పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి మండలంలోని నానక్రాంగూడ గ్రామంలో విజయనిర్మల తదితరులకు చెందిన 11.26 ఎకరాల పట్టా భూమి సేకరణలో వివక్ష చూపించినట్లు తమ విచారణలో తేలిందని కూడా చార్జిషీట్లో సిబిఐ తెలిపింది. ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినట్లు కనిపిస్తోందన్నారు. ఎమ్మార్ టౌన్షిప్ ప్రాజెక్టుకు ఎపిఐఐసి కేటాయించిన భూమిలో 2.20 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు వెల్లడించింది.