భాను తెలియదు: సబిత కొడుకు కార్తీక్, బాబుపై సెటైర్
మద్దెలచెర్వు సూరి హత్యతో తనకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నించారు. సూరి, భానులలో ఎవరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కాదని చెప్పారు. వారితో తనకు పరిచయం కూడా లేదన్నారు. ఈ కేసులో తనకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని సీనియర్ పోలీసు అధికారి రమణమూర్తి ఇప్పటికే తేల్చి చెప్పారని కార్తీక్ రెడ్డి గుర్తు చేశారు.
అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ తనను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తన పేరు పలికితే తప్ప చంద్రబాబుకు నిద్ర రాదని ఎద్దేవా చేశారు. భాను కేసు వివరాలు తన అమ్మ సబితా ఇంద్రా రెడ్డికి, సిఐడి అధికారులకు మాత్రమే తెలుసునని ఆయన చెప్పారు.
కాగా భాను కిరణ్తో సబిత ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు మూడు రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలను సబితా ఇంద్రా రెడ్డి అప్పుడే ఖండించారు. అనవసరంగా తన తనయుడిని ఈ వివాదంలోకి లాగవద్దని సూచించారు. తాజాగా కార్తీక్ రెడ్డి స్పందించారు.