పరిటాల హంతకులతో: జగన్పై వీరశివా సంచలన వ్యాఖ్య
జగన్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెరాసతో కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. సమైక్యవాదులు ఈ విషయాన్ని గుర్తించాలని వీర శివా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికలలో జగన్కు ఓటు వేయవద్దన్నారు. కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమన్నారు.
కాగా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తనకు మంగళి కృష్ణతో పరిచయం ఉందని భాను విచారణలో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయ. మంగళి కృష్ణతో జగన్కు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇరువురిది పులివెందులేనని, మొదటి నుండి జగన్కు బ్యాక్ బోన్గా కృష్ణ ఉన్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్పై వీర శివా రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కెసిఆర్తో జగన్ కుమ్మక్కయ్యాడని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ పలుమార్లు ఆరోపించారు. జగన్కు ఓటేస్తే రాష్ట్ర విభజనకు దారి తీసినట్లేనని, ఆయన రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తున్నాడని టిజి పలుమార్లు మండిపడ్డారు.