తెలంగాణపై హరీశ్వర్ రెడ్డి, సిఎంకు విచిత్ర అనుభవం
కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూనే మీరే చివరి ముఖ్యమంత్రి కావాలని హరీశ్వర్ రెడ్డి అడిగారు. అంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆయన ముఖ్యమంత్రిని పరోక్షంగా కోరారు. తెలంగాణ కోంస పిల్లలు చనిపోతున్నారని, విద్యార్థులపై కేసులు పెట్టారని ఆయన అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను కొన్నింటిని మాత్రమే ఎత్తేశారని, మిగతా కేసులను కూడా ఎత్తేయాలని సభలోనే ఉన్న హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఆయన కోరారు. హరీశ్వర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి నవ్వుతూ కనిపించారు.
కాగా, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి ప్రజాపథంలో వరాల జల్లు కురిపించారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో 300 కోట్ల రూపాయలతో 400 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పరిగిలో డిగ్రీ కళాశాలను కూడా స్థాపిస్తామని ఆనయ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ బడ్జెట్ను 20 కోట్ల రూపాయల నుంచి 220 కోట్ల రూపాయలకు పెంచామని ఆయన చెప్పారు.
పేదల కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. కిలో రూపాయికి బియ్యం పథకం, వడ్డీలేని రుణాలు వంటి కార్యక్రమాలను ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.