తెలంగాణ ఎంపీలపై సోనియా అసంతృప్తి: పాల్వాయి
తెలంగాణ రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలే కారణమని ఆయన ఆరోపించారు. ఎంపీలు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అడిషనల్ డిజి అవినీతిపరుడు అని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలనీలో అక్రమాలు జరిగాయంటే ఆయన పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యేలకే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. డిజిపికి పోలీసులపై పట్టు లేదని విమర్శించారు.
మరోవైపు ఏఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆమె రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రితో చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలపై కూడా చర్చించారని సమాచారం. కాగా భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆమె స్పష్టం చేశారు. క్రమశిక్షణ లేని నేతలే మార్పు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. తాను ముమ్మాటికి తెలంగాణవాదినేనని ఆమె చెప్పారు.