ఆళ్లగడ్డ నుండి పోటీకి సై: వెనక్కి తగ్గిన గంగుల ప్రతాప్
ప్రజలు, కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడప్పుడు ప్రభుత్వం, పార్టీపై ఒత్తిడి తేవాల్సి వస్తోందని చెప్పారు. తాము ఎక్కడ ఉన్నా ప్రజలు, కార్యకర్తల సంక్షేమాన్ని విస్మరించబోమని స్పష్టం చేశారు. పార్టీ తనను పోటీ చేయమని చెబితే తప్పకుండా చేస్తానన్నారు. కాగా ఆయన ఆళ్లగడ్డలో కాంగ్రెసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాగా గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ పైన అసంతృప్తి వెల్లగక్కడంతో ఈ తరహా ప్రచారానికి తెరలేచింది. నాలుగు రోజుల క్రితం, ఆళ్లగడ్డ నుండి మీరు పోటీ చేస్తున్నారా అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు.
దానికి ఆయన ఆళ్లగడ్డ అభ్యర్థి ఎవరో తనకు తెలియదని చెప్పారు. ఓ వైపు పార్టీ ఆయనే అభ్యర్థి అంటుంటే ఆయన మాత్రం తెలియదనడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన కాంగ్రెసును వీడనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత రెండు రోజుల క్రితం జిల్లా బాధ్యతలు చేపట్టిన మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆళ్ళగడ్డ నుండి గంగులనే తమ అభ్యర్థి అని, అందులో ఎలాంటి మార్పులేదని చెప్పారు. ఆ తర్వాత పెద్దల బుజ్జగింపులతో గంగుల మెత్తబడ్డట్లుగా తెలుస్తోంది.