సియోనిలో భాను కిరణ్ నివసించిన ఇంట్లో సిఐడి తనిఖీ
భాను కిరణ్ అక్కడ ఉన్నన్ని రోజులు ఎవరెవరితో కలిసి తిరిగాడు, ఎవరిని కలిశాడో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కొంతకాలం భాను అక్కడే ఉండటంతో అతను అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు, ఎక్కడకు వెళ్లేవాడు తదితర విషయాలను స్థానికులను అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. ఆయన వద్దకు ఎవరైనా వచ్చేవారా అనే కోణంలోనూ వారిని విచారిస్తున్నారు.
భాను కిరణ్కు ఇళ్లు చూపించిన సాహేథ్ రాణా అనే వ్యక్తిని పోలీసులు విచారించారు. తనకు భానుతో అంతకుముందు పరిచయం లేదని అతను పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది. భాను నివసించిన ఇంటి యజమానితో పాడు చుట్టుపక్కల ఉన్న స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. స్థానికులు భాను గురించి తమకు తెలిసిన వివరాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కాగా 2011 జనవరి నాలుగున మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన అనంతరం భాను కిరణ్ దేశంలోని పలు ప్రాంతాలలో తిరిగాడు. అనంతరం మధ్యప్రదేశ్లోని సియోనిలో ఎక్కువ కాలం నివసించాడు. అక్కడ ఓ గదిని కిరాయికి తీసుకొని గడిపాడు. సెల్ ఫోన్ ఉపయోగించకుండా కేవలం కాయిన్ బాక్సుల ద్వారానే ఫోన్లు రాష్ట్రానికి చేసేవాడు.