టివిలో రివాల్వర్, సెల్ఫోన్లు పెట్టిన భాను కిరణ్
సోమవారం ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో పోలీసులు సియోని చేరుకున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల వరకు విచారించారు. ఆ తర్వాత హైదరాబాదు బయలుదేరారు. భాను అక్కడ మహేష్ కుంజం పేరుతో రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తదితరాలు పుట్టించుకొన్నాడు. మహేష్ కుంజం పేరుతోనే మూడు సిమ్ కార్డులు తీసుకున్నాడు. భానుకు సహకరించిన వారిని అందరినీ ప్రశ్నించారు.
సియోనిలో ఉన్నదని చెప్పిన రివాల్వర్ ఎక్కడ దాచావని పోలీసులు భానును అడగగా, తాను టివిలో పెట్టానని చెప్పాడు. ఆ గదిలోని టివి కోసం పోలీసులు వెతికినా కనిపించలేదు. దీంతో ఇంటి యజమానిని ప్రశ్నించారు. భాను ఎన్ని రోజులకూ రాకపోవడంతో ఇంటి తాళం పగులగొట్టి తన సామాగ్రితో పాటు ఆయనకు చెందిన టివి, రెండు కుర్చీలు, ఒక సూటుకేసు భద్రం చేసినట్లు చెప్పి, ఆ గది తాళం తీశాడు.
అందులోని టివిని తెరిచి చూస్తే రివాల్వర్తో పాటు కొన్ని బుల్లెట్లు, మూడు సెల్ ఫోన్లు, ఒక పాన్ కార్డు బయటపడింది. సూటుకేసును పరిశీలించిన పోలీసులకు అందులో ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. భానును సియోని తీసుకువస్తున్నట్లు సిఐడి అధికారులు సియోని పోలీసులకు ముందస్తుగా సమాచారం అందించారు.
కాగా భాను కిరణ్కు చెందిన మరో ఇరవై ఆస్తి పత్రాలను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పదకొండు పత్రాలు భాను పేరు మీద ఉండగా, మరో తొమ్మిది ఇతరుల పేర్ల మీద ఉన్నాయి. కస్టడీలో ఉన్న భాను వెల్లడించిన వివరాల ఆధారంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు.