జగన్ ప్రచారం చేసేది కాంగ్రెస్ పథకాలే: శైలజానాథ్ ఫైర్
బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని వినియోగంలోకి రాని సెజ్ భూములను వెనక్కి తీసుకోవాలన్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్లు కాస్త సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ తన ప్రచారంలో కాంగ్రెసు పార్టీ విధానాలనే ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పథకాల లేబుళ్లనే ఆయన తగిలించుకుంటున్నారన్నారు. ప్రాజెక్టులు కట్టడం ప్రభుత్వం విధి అని చెప్పారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని వెంకట రమణ రెడ్డి అన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న పనులు చూసి వైయస్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఒప్పందం చారిత్రాత్మకం అన్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టమవుతోందని చెప్పారు. కంతనపల్లి ప్రాజెక్టును కూడా ప్రభుత్వం పూర్తి చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో అవినీతికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే ప్రిన్సిపల్ అని పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాఫ్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. వైయస్ అమలు చేసిన పథకాలు కాంగ్రెసు పథకాలే అన్నారు. అవి ఏ ఒక్క వ్యక్తికి చెందినవి కాదన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది చెప్పారు.