భాను కిరణ్ సాయం తీసుకోలేదు: దర్శకుడు తేజ
భాను కిరణ్ను గానీ అతని అనుచరుడిని గానీ తాను సంప్రదించలేదని తేజ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అన్నారు వివాదం పరిష్కారమైనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్తామని ఆయన అడిగారు. ఈ వ్యవహారంపై సిఐడి అధికారులు తేజను ప్రశ్నించారు కూడా. అయితే, మరోసారి ప్రశ్నించాల్సిన అవసరం లేదని సిఐడి అధికారులు తనకు చెప్పినట్లు తేజ చెప్పారు. తాను ఎవరినీ సంప్రదించడానికి ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు.
తేజకు, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాస రావుకు మధ్య అప్పట్లో ఆస్తి వివాదం తలెత్తింది. ఇందుకు సంబంధించి నిరుడు తేజపై ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో సిఐడి అధికారులు తేజను ప్రశ్నించారు. సిఐడి అధికారులను తాను రెండోసారి కలిశానని, అయితే మరోసారి ప్రశ్నించాల్సిన అవసరం లేదని సిఐడి అధికారులు చెప్పారని తేజ వివరించారు. తనను మళ్లీ పిలిస్తే తప్పకుండా సిఐడికి సహకరిస్తానని ఆయన చెప్పారు.
శేరిలింగంపల్లిలోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద సినీ నిర్మాతకు సంబంధించిన ఏడెకరాల భూవివాదాన్ని సెటిల్ చేసినట్లు భాను కిరణ్ నేరాంగీకార పత్రంలో తెలిపాడు. అయితే, భాను ఏ సినీ నిర్మాతను ఉద్దేశించి చెప్పాడనే విషయం అయోమయంగా ఉంది. భాను శివరామకృష్ణ అనే నిర్మాత పేరు చెప్పాడు. తాను భాను కిరణ్ను సంప్రదించలేదని, ఆ ప్రాంతంలో తనకు ఏ విధమైన భూమి లేదని నిర్మాత బూర్గుపల్లి శివరామకృష్ణ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.