పరకాలలో సురేఖను గెలిపించేందుకే కెసిఆర్: బిజెపి
కెసిఆర్ తెలంగాణపై పార్లమెంటులో తేల్చుకుంటామంటూ వెళతాడని, అక్కడేమీ పప్పులుడక్కపోవడంతో ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామంటూ, ఇక్కడికొచ్చి ఫాంహౌస్లో పడుకుని రెస్టు తీసుకుంటాడని విమర్శించారు. ఇలా రోజుకో మాట మాట్లాడే కెసిఆర్ పిట్టల దొరలా తయారయ్యాడని ధ్వజమెత్తారు. బిజెపిని విమర్శించడం టిఆర్ఎస్కు సరికాదన్నారు. పార్లమెంటులో సమైక్యవాద నినాదం గల ప్లకార్డు ప్రదర్శించిన జగన్ను ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు.
మైనారిటీలకు తెరాస చేసిందేమిటో చెప్పాలన్నారు. ఓడిపోయే స్థానాల్లో మైనారిటీలను బరిలోకి దించుతూ గెలిచే స్థానాల్లో మాత్రం కెసిఆర్ తన సొంత మనుషులను పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు. జనార్దన్ రెడ్డి చనిపోయాక ఖైరతాబాద్లో ఆయన కుమారుడు గెలుస్తాడని తెలిసినా తెరాస అభ్యర్థిగా అరీఫుద్దీన్ అనే మైనారిటీ వ్యక్తిని పోటీకి నిలిపారని, మహబూబ్నగర్లో ఓడిపోతామని తెలిసి మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించారని ఆరోపించారు.
ఇది మైనారిటీలకు తెరాస ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. పరకాలలో గెలుస్తామని చెప్పుకొంటున్న కెసిఆర్కు దమ్ముంటే మైనారిటీ అభ్యర్థిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. నిజానికి పరకాలలో గెలుపు కోసం టిఆర్ఎస్ పోటీ చేయడం లేదని, జగన్ పార్టీని గెలిపించడానికే యత్నిస్తుందని విమర్శించారు. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ జెఏసిపై కెసిఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు టిఆర్ఎస్ తెలంగాణ జెఏసిలో ఉండడమో బయటకు వెళ్లిపోవడమో తేల్చుకోవాలన్నారు.
అసలు టిఆర్ఎస్ అభ్యర్థిని నిర్ణయించేది కూడా జగనేనని ఎద్దేవా చేశారు. గత ఉప ఎన్నికల్లో కోవూరులో అభ్యర్థిని నిలబెట్టి, తానూ ప్రచారం చేస్తానని ప్రకటించిన కెసిఆర్, జగన్ నుంచి ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గారని ఆరోపించారు. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తమదే గెలుపని ఆరు నెలల క్రితం కెసిఆర్ ప్రచారం చేశారని గుర్తు చేశారు.