పరకాలలో కెసిఆర్కు చెక్ పెట్టేందుకు బిజెపి పాట్లు
తాజాగా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ మద్దతు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి తమకు పట్టున్న ప్రాంతం కావడంతో ఏ మాత్రం అవకాశం చిక్కినా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో బిజెపి ఉంది. ఈ క్రమంలోనే పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ రావు అక్కడే తిష్ట వేసి పార్టీ నేతలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గతంలో పార్టీని వీడి వెళ్లిన నాయకులందరినీ మళ్లీ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం కూడా మొదలైంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు గెలవకూడదని కోరుకుంటున్న టిడిపి, కాంగ్రెస్ పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించిందట. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రధాన పోటీ తెరాస, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి అభ్యర్థుల మధ్యే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. వీటిలో ఏ ఒక్క పార్టీ గెలవకూడదని భావించే కాంగ్రెస్, టిడిపిల మద్దతును కూడగట్టాలన్న ఆశ బిజెపి నేతలలో ఉందని అంటున్నారు.
ఈ రెండు పార్టీలు లోపాయికారీగా మద్దతిస్తే తమ పార్టీ గన్షాట్గా గెలుస్తుందన్నది కమలనాథుల అంచనా వేస్తున్నారట. మీ పార్టీలు గెలవలేవని భావిస్తే ఇక్కడ అంతో ఇంతో మెరుగ్గా ఉన్న తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, అప్పుడు తెరాస, వైయస్సార్ కాంగ్రెసులకు చెక్ చెప్పవచ్చునని చెబుతున్నారట. తెలంగాణలో బిజెపి బలపడుతుందన్న భయంతోనైనా కాంగ్రెస్ తెలంగాణకు అనుకూల ప్రకటనలు చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్, టిడిపిలలోని తెలంగాణవాదులను బిజెపి కోరుతోందని అంటున్నారు.