బిజెపిలో సిఎం పీఠం చిచ్చు, రాజేకు ఎమ్మెల్యేల మద్దతు
పార్టీకి చెందిన నేతలు, యువ మోర్చా నేతలు కూడా రాజీనామాలకు సై అన్నారు. ఈ మేరకు లేఖలను నేరుగా వసుంధరకే సమర్పించారు. వచ్చే ఎన్నికలలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతూ రాష్ట్ర వ్యాప్తంగా లోక్ జాగరణ్ యాత్ర చేపట్టాలని భావించిన ఆ పార్టీ నేత గులాబ్ చంద్ కటారియా యత్నాలతో బిజెపి రాష్ట్ర శాఖలో చిచ్చు రగిలిన సంగతి తెలిసిందే. కటారియా యాత్రకు అనుమతిస్తే తాను పార్టీ నుంచి వైదొలగుతానని వసుంధర ప్రకటించే స్థాయికి చేరింది.
ఈ మేరకు శుక్రవారం రాత్రి వసుంధర మీడియా ముందు ప్రకటన కూడా చేశారు. ఈ పరిణామాలతో కంగుతిన్న పార్టీ అధిష్ఠానం యాత్ర చేయబోనంటూ కటారియాతో ప్రకటన ఇప్పించి పరిస్థితిని చల్లబర్చాలని యత్నించింది. అయితే, అవేమి ఫలించలేదు. తాజాగా శనివారం దాదాపు 56 మంది ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కీలక నేతలు వసుంధర ఇంటి వద్ద క్యూ కట్టారు. ఆమెకు మద్దతుగా తాము రాజీనామాలు చేస్తామంటూ అందుకు సంబంధించిన లేఖలను ఆమెకు అందజేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. రాజస్థాన్ అసెంబ్లీలో బిజెపికి ప్రస్తుతం 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరిలో ఇప్పుడు 56 మంది వసుంధరకు మద్దతుగా ఆమె పంచన చేరారు. దీనిపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ ఇది చాలా చిన్న విషయమని అంతా సర్దుకుటుందని అన్నారు. వసుంధర చాలా సీనియర్ నేత అని, ఆమె పార్టీ నుంచి వైదొలగే పరిస్థితి ఉండబోదని, ఆమెను సమున్నతంగానే గౌరవిస్తున్నామని పార్టీ నేత బల్బీర్ పుంజ్ పేర్కొన్నారు. ఇది మా పార్టీ అంతర్గత విషయమని, దీన్ని మేం పరిష్కరించుకుంటామని వసుంధర చెప్పారు.
వివాదరహితమైన వసుంధర నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని పార్టీ కూడా అందుకు సమ్మతించాలని ఎమ్మెల్యే భవానీ సింగ్ పేర్కొన్నారు. తక్షణం కేంద్ర నాయకత్వం వసుంధరను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సుభాష్ మెహ్రియా కోరారు. ఈ వ్యవహారంపై కటారియా స్పందిస్తూ తన యాత్రపై ఇంత పెద్దస్థాయిలో దుమారం రేగడం వాంఛనీయం కాదని వ్యాఖ్యానించారు.