భాను కిరణ్ కస్టడీకి సైబరాబాద్ పోలీసుల మెమో
కూకట్పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో భాను కిరణ్ చేసినట్లు చెబుతున్న భూముల సెటిల్మెంట్లపై సమాచారాన్ని రాబట్టేందుకు భాను కిరణ్ను తమకు అప్పగించాలని సైబరాబాద్ పోలీసులు కోర్టును కోరారు. మాదాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో భాను కిరణ్ పెద్ద యెత్తున సెటిల్మెంట్లు చేసినట్లు సిఐడి విచారణలో కూడా వెల్లడైంది.
భూముల సెటిల్మెంట్లలో సహకరించిన పోలీసులు ఎవరనే విషయంపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు. తనకు పోలీసులు సహకరించారని భాను కిరణ్ సిఐడి అధికారులకు చెప్పారు. భాను కిరణ్ను విచారించేందుకు ప్రత్యేకంగా డిసిపి స్థాయి అధికారిని నియోగించనున్నట్లు తెలుస్తోంది. భూముల సెటిల్మెంట్లకు సంబంధించి కొంత మంది పోలీసులపై కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, భాను కిరణ్ కేసుల్లో సిఐడి అధికారులు రెవెన్యూ, సాగునీటి పారుదల, రిజిస్ట్రేషన్ శాఖలకు లేఖలు రాశారు. భాను కిరణ్ వ్యవహారాల్లో అధికారుల పాత్రపై తెలుసుకునేందుకు సిఐడి ఈ లేఖలు రాసినట్లు సమాచారం. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి భాను కిరణ్ కాంట్రాక్టర్లను బెదిరించి, కొంత మందికి టెండర్లు దక్కేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే, భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూవివాదాల సెటిల్మెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై చివరి రెండు శాఖల నుంచి సిఐడి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.