నిర్మాత కళ్యాణ్ కలర్ ల్యాబ్లో సిఐడి తనిఖీలు
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి, భాను కిరణ్ నేరాల్లో పాలు పంచుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ వ్యవహారాలపై సిఐడి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వెల్లడించిన తొమ్మిది ఆస్తుల లీడ్లను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాదులోని ఫిల్మ్ నగర్లో గల సి. కళ్యాణ్కు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్లో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు.
భాను కిరణ్తో కలిసి సి. కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో పలు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సిఐడి అధికారులు దృష్టి సారించారు. బాలజీ కలర్ ల్యాబ్లో తనిఖీల సందర్భంగా సిఐడి అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరో నిర్మాత సింగనమల రమేష్కు భాను కిరణ్ను సి. కళ్యాణ్ పరిచయం చేశాడని ఆరోపణలు వచ్చాయి.
సూరి హత్యకు సింగనమల రమేష్ సమక్షంలో భాను కిరణ్ శంషాబాద్లో టెస్ట్ ఫైరింగే చేసినట్లు సిఐడి అధికారుల విచారణలో తేలినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భాను కిరణ్ తన నేరాంగీకార పత్రంలో తెలిపాడు. సి. కళ్యాణ్, సింగనమల రమేష్ సహకారంతో భాను కిరణ్ చిత్ర పరిశ్రమలో కూడా తన దందాను సాగించినట్లు అనుమానిస్తున్నారు.
భాను కిరణ్కు కొంత మంది హీరోయిన్లతో పరిచయాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. 2010 డిసెంబర్లో రక్తచరిత్ర-2 సినిమాను సి కల్యాణ్తో పాటు రాప్తాడు నియోజకవర్గంలోని ప్రజలకు బెంగళూరుకు తీసుకెళ్లి ప్రివ్యూ చూపించానని సిఐడి కస్టడీలో భాను అంగీకరించాడు. సూరిని హత్యచేసే ముందు శింగనమల రమేష్తో కలిసి శంషాబాద్లో ఒకసారి, గురుకుల ట్రస్ట్ భవన్లో మరోసారి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశానని దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. రక్తచరిత్ర సినిమా నిర్మాత రామ్ గోపాల్ వర్మను కూడా సిఐడి అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.