సాక్షి డైలీ వర్సెస్ ఈనాడు డైలీగా మారుతుందా?
ఈనాడు దినపత్రికకు గట్టి పోటీ ఇస్తున్నందు వల్ల సాక్షి దినపత్రికను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్సిస్తున్నారు. సాక్షి మీడియా బ్యాంకు ఖతాలను స్తంభింపజేయడాన్ని ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా, పత్రికా స్వేచ్ఛకు విఘాతంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సాక్షి యాజమాన్యం మేధావులు, పత్రికా రచయితల మద్దతును కూడగట్టడానికి కూడా ప్రయత్నిస్తోంది.
ప్రధానంగా ఈనాడు డైలీకి, సాక్షికి మధ్య వైరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొమ్ముకాస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈనాడు ఏకపక్షంగా వార్తలు రాస్తోందని వారు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శోభా నాగిరెడ్డి, జూపూడి ప్రభాకర రావు, వాసిరెడ్డి పద్మ వంటి నాయకులు ఈనాడు దిపత్రికపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.
కాగా, పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన ఎబికె ప్రసాద్ వైయస్ జగన్కు బాసటగా నిలిచారు. బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడాన్ని ఆయన పత్రికా స్వేచ్ఛను దెబ్బ తీయడంగా ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్సీ కె. నాగేశ్వర్ కూడా సాక్షికి మద్దతుగా మాట్లాడారు. కొంత మంది జర్నలిస్టులు కూడా సాక్షికి మద్దతుగా నిలబడ్డారు. తెలుగు పత్రికా రంగంలో రాజకీయాలు చోటు చేసుకుని, పార్టీలవారీగా పత్రికలు విడిపోయిన వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో సాక్షి దినపత్రిక ఓ వర్గాన్ని తన వైపు తిప్పుకుంది. అందుకే, ప్రస్తుత స్థితిని ఈనాడు, సాక్షి పత్రికల మధ్య సమరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.