సిబిఐ ఫ్రీజ్ చేసిన సాక్షి టీవీ ఖాతాలో రూ. 110 కోట్లు
సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడాన్ని జగన్ పత్రికా స్వేచ్ఛపై దాడిగా వైయస్ జగన్ అభివర్ణిస్తున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఒబి) జూబ్లీహిల్స్ శాఖలో ఉన్న మరో రెండు కంపెనీల ఖాతాలను సిబిఐ బుధవారం స్తంభింపజేస్తింది. జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ), జననీ ఇన్ఫ్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను సిబిఐ మంగళవారం నిలిపేసింది. ఈ ఖాతాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (జూబ్లీహిల్స్ శాఖ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బంజారాహిల్స్ శాఖ)ల్లో ఉన్నాయి.
వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా సిబిఐ సాక్షి మీడియాకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. తమ వాదనలు వినకుండా ఖాతాలను స్తంభింపజేయడాన్ని ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రా కోర్టులో సవాల్ చేశాయి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రత్యేక న్యాయమూర్తి పట్టాభి రామారావు సిబిఐని అదేశించారు. సాక్షి దినపత్రికను, సాక్షి టీవీని మూసివేయించాలనే కుట్రలో భాగంగానే ఖాతాలను స్తంభింపజేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
కాగా, సాక్షి మీడియా ఖాతాల స్తంభనను తెలుగుదేశం పార్టీ సమర్థిస్తోంది. పత్రికా స్వేచ్ఛకు, అవినీతికి సంబంధం లేదని, ఖాతాల స్తంభనను పత్రికా స్వేచ్ఛతో ముడిపెట్టకూడదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే వాదనను వినిపించారు.