సాక్ష్యం చెప్పేందుకు వెళ్తూ మాజీ అడిషనల్ ఎస్పీ మృతి
సుధాకర్ను ఎవరైనా రైల్లోంచి తోసేశారా? లేక ఆయనే ప్రమాదవశాత్తు పడిపోయారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ హత్య కేసులో ఆయన ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కారు. కానీ బుధవారం కోర్టుకు హాజరు కాలేదు. సుధాకర్ బ్యాగ్, కేసుకు సంబంధించిన ఫైల్ కృష్ణా ఎక్స్ప్రెస్ బోగీల్లో రైల్వే సిబ్బంది కంటపడ్డాయి.
దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణా ఎక్స్ప్రెస్ వచ్చే మార్గంలోని పోలీస్స్టేషన్లకు సమాచారమిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కర్కెల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని చిక్నా గ్రామ సమీపంలో రైల్వేట్రాక్పై గుర్తు తెలియని శవం ఉందని ఆ గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు.
ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అప్పటికే మహారాష్ట్ర పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా భావించి పూడ్చిపెట్టేశారు. ఈ విషయం ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు చేరింది. బుధవారం రాత్రి భైౖంసా డీఎస్పీ దేవిదాస్ నాగులు, ముథోల్ సీఐ శ్రీనివాస్, బాసర ఎస్ఐ సతీష్ పూడ్చిన శవాన్ని తీయించి, సుధాకర్ స్వగ్రామమైన నిజామాబాద్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
నిజామాబాద్ పట్టణంలోని కంఠేశ్వర్కు చెందిన సుధాకర్ 1985 ఎస్ఐగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, నిర్మల్, మంచిర్యాల డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా పదవీ విరమణ పొందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని అప్పాలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు.