తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్గా గద్దర్ రాజీనామా
దోపిడీని ఎదిరించడానికి తాను ఎంతకైనా తెగిస్తానని ఆయన అన్నారు. ఇప్పటివరకు చేపట్టిన ఉద్యమం వల్ల తెలంగాణ సాధించలేకపోయామని, తెలంగాణ సాధనకు ఉద్యమ రూపం మారాల్సి ఉందని, ఉద్యమాన్ని యుద్ధంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం విఫలమైందనే మాటను ఆయన అంగీకరించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టించేందుకు తమ శక్తి సరిపోలేదని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం ఇప్పటి వరకు జరిగినవి నిరసన ఉద్యమాలు మాత్రమేనని, అవి తెలంగాణ సాధనకు సరిపోలేదని ఆయన అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను భాగస్వాములను చేయకుండా తెలంగాణ రాదని, తెలంగాణకు అనుకూలంగా జరుగుతున్న ఉద్యమంలో వారిని భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తాను ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుత ఉద్యమం ద్వారా తెలంగాణ రాదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలు నిరాశకు గురి కావద్దని ఆయన అన్నారు. గత 18 నెలల తెలంగాణ ఉద్యమంలో తానేమీ అలసిపోలేదని, ఉద్యమంలో విఫలమయ్యామా, సఫలమయ్యామా అనేది ప్రజలు చెబుతారని, అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించడానికి తమ శక్తి సరిపోలేదని ఆయన అన్నారు. ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ప్రజలను సమీకరిస్తానని ఆయన చెప్పారు.