ఈనాడు అంత కవరేజ్ ఇస్తే వైయస్ కక్ష కట్టారు: విహెచ్
సాక్షి ఖాతాల స్తంభనన పత్రిక స్వేచ్ఛతో ముడిపెట్టవద్దని కోరారు. సూర్య పత్రిక యజమాని నూకారపు సూర్యప్రకాశ్ రావును జైల్లో పెట్టినప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల సంక్షేమం గురించి ఈ పాత్రికేయ సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు. జీతాలు రాని పరిస్థితి వస్తే ఉద్యోగులు యాజమాన్యాన్ని నిలదీయాలి తప్పితే రోడ్ల మీదకొచ్చి రాజకీయ నినాదాలు చేయడం ఏమిటన్నారు. జగన్కు ఏమీ కాకుండానే రోడ్ల మీదకొచ్చి రంకెలేస్తున్నారన్నారు.
నూకారపును అరెస్ట్ చేసినప్పుడు సూర్య ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రశ్నించారా అన్నారు. జగన్ మీడియాకు ఏమీ జరగకముందే టీవీల్లో గంటల తరబడి విశ్లేషణలు నడుపుతున్నారని, లక్ష రూపాయలు తీసుకున్న కేసులో దళిత నేత బంగారు లక్ష్మణ్కు కోర్టు నాలుగేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించినప్పపుడు ఏ టివి కూడా విశ్లేషణ ఎందుకు చేయలేదన్నారు. రాజకీయం చేసి జగన్కు మేలు చేయడం తప్ప దీని వెనుక మరో ఉద్దేశ్యం లేదన్నారు.
రూ.వేల కోట్లు కూడబెట్టిన జగన్ మరో అయిదేళ్లయినా జీతాలు ఇవ్వగలడన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చదవవద్దని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చినప్పుడు పాత్రికేయ సంఘాలు ఎందుకు స్పందించలేదన్నారు. ఖాతాలు స్తంభింప చేస్తేనే పత్రిక స్వేచ్ఛను హరించి వేసినట్లా అని ప్రశ్నించారు. మార్గదర్శిని మూసేయించి ఈనాడును దెబ్బకొట్టాలని వైయస్ ప్రయత్నించినప్పుడు నాయకులెవ్వరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతిలు సాక్షి అవినీతిని వ్యతిరేకించినా... సాక్షి ఉద్యోగుల ఆందోళనకు కవరేజి ఇచ్చాయన్నారు. మార్గదర్శిపై ఉండవల్లి కేసు వేసినా ఆయన ప్రకటనలనూ ఈనాడు ప్రచురించిందన్నారు. కానీ సాక్షి మాత్రం ఎదుటివారిపై బురదజల్లడాన్ని పనిగా పెట్టుకుందన్నారు. వైయస్ పాదయాత్రకు ఈనాడు ఇచ్చినంత కవరేజ్ ఏ పత్రికా ఇవ్వలేదన్నారు. అలాంటి పత్రిక పైనే తర్వాత ఆయన కక్ష కట్టారన్నారు.
ఇప్పుడు జరుగుతున్నది అవినీతిపైన దాడే తప్ప పత్రికా స్వేచ్ఛ పైన కాదన్నారు. సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం మంచి చర్య అన్నారు. ఇది కేవలం అవినీతిపై దాడేనని, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి జర్నలిస్టులకు హాని జరిగితే తాము కూడా ఆందోళనకు దిగుతామని ఆయన తన నివాసంలో మాట్లాడుతూ చెప్పారు.