సాక్షి సంస్థల ఖాతాల స్తంభన సరైందే: నారాయణ
క్యాప్టివ్ అన్న పదం తీసేసిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జైల్లో వుంటే, రాజకీయ నాయకులు బయట ఉంటున్నారని ఆయన అన్నారు. గాలి జనార్దనరెడ్డి 12 వేల కోట్లు సంపాదించాడని ఆయన చెప్పారు. "రాష్ట్రంలో సీఎం కుర్చీ తనదేనన్నట్టు జగన్ మాట్లాడుతున్నారు. అవకాశవాద రాజకీయాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టని వారంతా మన నాయకులా?'' అని ఆవేదన వ్యక్తంచేశారు.
సాగు నీటి ప్రాజెక్టులు రూపకల్పన చేసిన వైఎస్ మరణించినా అవినీతి మాత్రం ఆగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన స్తంభించిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ధరలు పెంచేందుకు మన ఎంపీలు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.
రాష్ట్రం నుంచి కాంగ్రెస్కున్న 33 మంది ఎంపీలు గంగిరెద్దుల్లా తలలూపుతున్నారు తప్ప వారి వల్ల వీసమెత్తు ఫలితం లేదని విమర్శించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని, దీనివల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని నారాయణ ఆరోపించారు.