పరిశ్రమలో మాఫియా: నిర్మాత సి.కళ్యాణ్పై సిఐడి ఆరా
మా అన్నయ్య బంగారం సినిమాకు చెందిన మోహన్ రాజు అనే నిర్మాతతో గల రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీ గురించి భానుకు చెప్పగా చిన్నదేగా... నువ్వే సెటిల్ చేసుకో అని సలహా మాత్రమే ఇచ్చారని ఆయన వివరించారు. 2003కు ముందు సి.కళ్యాణ్ సినిమా రంగంలో గుర్తింపులేని వ్యక్తని, భానుతో కలిసి సినీ పరిశ్రమలోకి మాఫియాను ప్రవేశపెట్టి కోట్లాది రూపాయల సెటిల్మెంట్లు చేసి పెద్ద నిర్మాతగా ఎదిగారని ఆయన చెప్పారు. ల్యాంకో హిల్స్ ప్రాంతంలోని చిత్రపురి ఫ్లాట్లలో సినీ పరిశ్రమ వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా సంబంధంలేని వెయ్యిమందికి సి.కళ్యాణ్ ముఠా ఫ్లాట్లు కేటాయించిందని పేర్కొన్నారు.
మరో నిర్మాత అశోక్ కుమార్కు పవర్ ప్లాంట్లు ఎలా వచ్చాయని, దాని వెనక ఉన్న వ్యక్తులెవరని సిఐడి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. నిర్మాత కొడాలి వెంకటేశ్వర రావు ఆర్థిక పరిస్థితి ఇతర లావాదేవీలతో పాటు నిర్మాతలు బూరుగుపల్లి శివరామకృష్ణ, శ్రీనివాసరావు మధ్య గొడవల గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. సోమవారం మరోమారు ఆయనను సీఐడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం.
కాగా మరోవైపు మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్కు సంబంధించి ఆయా స్టేషన్లలో నమోదైన కేసులపై సిఐడి ఆరా తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భానుపై పదిహేను కేసులు నమోదయ్యాయి. ఇందులో అక్రమాయుధాల కేసులు, ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చిన కేసు, భూకబ్జాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు తదితర కేసులున్నాయి. వీటిలో సూరి హత్యకేసుతో పాటు తొమ్మిది కేసులు సిఐడి దర్యాప్తు చేస్తోంది.
అయితే సూరి హత్యకేసులో తొమ్మిది రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన అధికారులు మిగతా కేసుల్లోనూ కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ వద్దఉన్న తొమ్మిది కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా స్టేషన్ల నుంచి సేకరిస్తున్నారు. వీటిలో ఏయే కేసుల్లో కస్టడీ పిటిషన్ వేయాలనేదానిపై సిఐడి నిర్ణయం తీసుకోనుంది.