రెండు రోజుల్లో తేల్చాలి: తివారీకి హైకోర్టు ఆదేశం
తనను తివారీకి పుట్టిన బిడ్డగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే యువకుడు దావా వేశాడు. అది తివారీ మెడకు చుట్టుకుంది. రోహిత్ శేఖర్ వాదనలోని నిజాన్ని తెలుసుకోవడానికి రక్త నమూనా ఇవ్వాలని కోర్టు తివారీని అదేశించింది. అయితే, తివారీ అందుకు ముందుకు రాకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. తివారీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే బలవంతంగా రక్తం నమూనాను సేకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. తివారీ రక్తం నమూనాను పోలీసుల సహకారంతో తీసుకోవడానికి ఓ కమిషనర్ను నియమించాలని రోహిత్ శేఖర్ కోర్టును కోరారు.
పితృత్వం కేసులో డిఎన్ఎ పరీక్ష నిమిత్తం రక్తం నమూనాను ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఎన్డీ తివారీ డిఎన్ఎ పరీక్ష కోసం రక్తం నమూనాను ఇవ్వాల్సిందేనని, అవసరమైతే పోలీసు సహాయం తీసుకుని బలవంతంగా తివారీ రక్తాన్ని తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. రోహిత్ శేఖర్ అనే యువకుడు - తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాడు. తన తల్లి ఉజ్వల శర్మతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తివారీకి తాను జన్మించానని అతను వాదిస్తున్నాడు.
దాంతో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణించారు. ఆ వాదనలను కోర్టు తిరస్కిరించింది.
తివారీయే తన అసలు తండ్రి అని వాదిస్తున్న రోహిత్ శేఖర్ (31), ఆయన తల్లి ఉజ్వల ఇంతకు ముందు మరో వైపు నుంచి నరుక్కొచ్చారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్డీ)లో ఉజ్వల భర్త బీపీ శర్మకు డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. ఈ నివేదికను సీల్డ్ కవర్లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. నివేదికను జస్టిస్ రేవా ఖేత్రపాల్ కోర్టులో చదివి వినిపించారు.
రోహిత్ డీఎన్ఏ తల్లి ఉజ్వలతో సరిపోలుతోందని, ఆమె భర్త బీపీ శర్మతో సరిపోలడంలేదని తెలిపారు. దీంతో ఉజ్వల, బీపీ శర్మల బంధం వల్ల రోహిత్ జన్మించలేదని రుజువైంది. 'తివారీయే నా తండ్రి' అన్న రోహిత్ వాదనకు బలం చేకూరింది.