నట్టి కుమార్ వర్సెస్ కళ్యాణ్: హోరెత్తుతున్న తిట్లు
నట్టి కుమార్ తన కాలి గోటితో సమానమని నిర్మాత సి.కళ్యాణ్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నట్టి కుమార్ పేరే తాను పలకకూడదనుకున్నానని అన్నారు. ఓ కేసు విచారణలో ఉన్న సమయంలో మాట్లాడకూడదనే తాను మిన్నకుండి పోయానని చెప్పారు. తనపై నట్టి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తనపై ఆరోపణలు చేసిన నట్టి మూడు రోజులలో ఆధారాలతో సహా బయట పెడతానని వారం రోజుల క్రితం చెప్పాడని, కానీ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదన్నారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు.
తాను ఇప్పుడు నట్టి కుమార్ పైన ఆధారాలతో సహా వచ్చానని చెప్పారు. నట్టి తన బాలాజి కలర్ ల్యాబ్కు వచ్చింది కేవలం రెండుసార్లు మాత్రమే అన్నారు. బ్లాక్ మెయిల్ చేయడం అతనికి అలవాటే అన్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ త్రీ చిత్రానికి తనకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. డబ్బులు నొక్కేసిన నట్టి అందరిపై ఆరోపణలు చేస్తుంటాడన్నారు. చిన్న నిర్మాతలను లోబర్చుకొని నిత్యం బ్లాక్ మెయిల్ చేస్తుంటారని కళ్యాణ్ విరుచుకుపడ్డారు.
నట్టి కుమార్ పైన ఫిర్యాదు చేసిన సుందర్ ఎవరో తనకు తెలియదని, కానీ ఆయన వెనుక తాను ఉన్నానని నట్టి ఆరోపించడం విడ్డూరమన్నారు. సుందర్ పేరే తాను మొదటిసారి వింటున్నానని చెప్పారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్తో తనకేం సంబంధమన్నారు. భాను ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడన్నారు. తాను ఎప్పుడు సినీ రంగంలోకి వచ్చానని అన్నారు. 182 సినిమాలను విడుదల చేసినట్లు చెప్పారు.
సిఐడి విచారణను తప్పుతోవ పట్టించేందుకే సి కళ్యాన్ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఫైట్ మాస్టర్ సుందర్ తనపై ఫిర్యాదు చేయడం కళ్యాణ్ ఆడిస్తున్న నాటకమేనని నట్టి కుమార్ అంతకు ముందు ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్దమని నట్టి స్పష్టం చేశారు. సినీ రంగాన్ని శాసిస్తున్న అతిరథ మహారథుల బండారం త్వరలోనే బయట పడుతుందని ఆయన అన్నారు. తనకు న్యాయం జరుగకుంటే ఆమరణ దీక్ష చేస్తానని, అవసరం అయితే సుప్రీం కోర్టు వరకు వెళ్తానని నట్టి కుమార్ అన్నారు.
భానుతో కలిసి నట్టి కుమార్ తనను బెదిరించాడని, తన వద్ద అప్పుగా తీసుకున్న కోటి రూపాయలను ఇవ్వకుండా వేధించాడని ఫైట్ మాస్టర్ సుందర్ సిఐడిలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ కళ్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. సుందర్ ఓ రౌడీ షీటర్ అని నట్టి కుమార్ ఆరోపించారు. సుందర్ ఎవరో ఆయన చెప్పడానికి ప్రయత్నించారు.
గత కొన్ని రోజుల క్రితం నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సి కళ్యాణ్పై నిప్పులు చెరిగారు. సి కళ్యాణ్ భానుకు బినామీ అని, భాను అక్రమంగా సంపాదించిన డబ్బును సి కళ్యాణ్ ద్వారా సినిమాల్లో పెట్టుబడులు పెట్టించాడని ఆరోపించారు. అనేక క్రిమినల్ కేసులు సి కళ్యాణ్పై ఉన్నాయని, అలాంటి నేరచరిత్ర గల వ్యక్తిని నిర్మాతల మండలిలో కొనసాగనివ్వడం ఏమిటని ప్రశ్నించారు.
నట్టి కుమార్ ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు పేరును కూడా వివాదంలోకి లాగారు. కళ్యాణ్ సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు కాదని, బ్రోకర్ అని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. కళ్యాణ్ను సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా చేసినందుకు దాసరి నారాయణ రావు సిగ్గపడాలని ఆయన అన్నారు. కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తిట్టిన తిట్టు తిట్టిన తర్వాత మళ్లీ నట్టి కుమార్ ప్రతిస్పందించారు. కళ్యాణ్పై నట్టి కుమార్ వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. కళ్యాణ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. దాసరి నారాయణరావు మాఫియాను ప్రోత్సహించినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.