హమ్మయ్య ఛాన్స్ వచ్చేసింది!: పరకాలపై టిడిపి దృష్టి
పరకాల నియోజకవర్గంలోని మండలాలకు, గ్రామాలకు ఆయా స్థాయి నేతలను ఇంచార్జులుగా నియమించారు. ఈ నియోజకవర్గం పరిధిలో మండలాలకు ముఖ్యస్థాయి నేతలను ఇంచార్జులుగా నియమించారు. సంగెం మండలానికి కడియం శ్రీహరి, పరకాలకు రేవూరి ప్రకాశ్ రెడ్డి, గుండు సుధారాణి, గీసుగొండకు ఎర్రబెల్లి దయాకర రావు, ఆత్మకూరుకు వేం నరేందర్ రెడ్డి, సీతక్క, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న చోట సత్యవతి రాథోడ్ను ఇంచార్జిలుగా నియమించారు.
సెగ్మెంటులోని ప్రతి గ్రామానికి ఇంచార్జులను నియమించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తెలంగాణలో ఉన్న బలమైన సెంటిమెంట్ దృష్ట్యా టిడిపి వరుసగా ఓడుతూ వస్తోంది. ఓ దశలో గ్రామాలలో తిరగలేని స్థితికి చేరుకుంది. అయితే పరకాల నియోజకవర్గం వారికి పార్టీని మళ్లీ తెలంగాణలో బలంగా నిలిపే బలీయమైన శక్తిగా కనిపిస్తోంది.
ఇన్నాళ్లూ తెలంగాణ సెంటిమెంట్ను కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే సొమ్ము చేసుకుంది. అయితే పాలమూరులో బిజెపి ఘన విజయం తర్వాత ఆ పార్టీ కూడా టిఆర్ఎస్కు పోటీగా రంగంలోకి దిగుతోంది. పరకాలలో బిజెపి, టిఆర్ఎస్ ఢీకొంటున్నాయి. మరోవైపు తెలంగాణవాదం పేరుతో డిఎస్పీ వంటి అత్యున్నత పదవికి రాజీనామా చేసిన నళిని కూడా పోటీకి సై అంటున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ జెఏసి కూడా అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఓట్లు భారీగా చీలిపోయే అవకాశముంది. దీనిని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తోంది. తెలంగాణ కోసం అంటే గొంగళి పురుగును కూడా కౌగిలించుకుంటానని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు బిజెపి జాతీయస్థాయిలో తెలంగాణవాదం ఎత్తుకున్నప్పటికీ వారికి అండగా నిలబడక పోవడం ప్రజలను ఆలోచింప చేస్తుందని అంటున్నారు. తెలంగాణపై కెసిఆర్ చిత్తశుద్ధిని ఇప్పుడు చాలామంది శంకిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇన్నాళ్లూ కెసిఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నది కేవలం ఓట్లు, సీట్ల కోసమేనని, బిజెపికి అండగా నిలబడక పోవడాన్ని బట్టి అర్థమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తెరాస వైఖరిపై ఆలోచిస్తున్నారని, వారు బిజెపికి ఓటు వేసే అవకాశముందని అంటున్నారు. దీంతో తెలంగాణ ఓట్లలో భారీ చీలిక వస్తుందని టిడిపి భావిస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం నేతలంతా పరకాల నియోజకవర్గంలో పాగా వేసి వ్యూహాలు రచిస్తున్నారు.