రాజాకు బెయిల్: ఢిల్లీ వదలొద్దని కోర్టు షరతు
రాజాకు సిబిఐ పాటియాలా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ వదిలి వెళ్లరాదని ఆదేశించింది. తమిళనాడుకు వెళ్లరాదని కోర్టు రాజాను ఆదేశించింది. రాజా మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రాజాకు బెయిల్ ఇవ్వరాదని సిబిఐ కోర్టులో వాదించింది. లెసెన్సుల మంజూరులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించింది.
తెల్ల చొక్కా, బూడిద రంగు ప్యాంట్ వేసుకుని రాజా మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. భార్య పరమేశ్వరి ఆయన వెంట ఉన్నారు. బెయిల్ మంజూరు ఆదేశాలు రావడానికి గంట ముందు కోర్టులో ఆయన డిఎంకె నాయకురాలు, కరుణానిధి కూతురు కనిమొళితో జోక్ చేస్తూ మాట్లాడడం కనిపించారు. కనిమొళి కూడా ఈ కేసులో జైలులో ఆరు నెలల పాటు ఉన్నారు. ఆమెకు 2011 నవంబర్లో బెయిల్ మంజూరైంది.
కనిమొళిలతో పాటు 12 మంది నిందితులకు 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో బెయిల్ మంజూరైంది. రాజా మాత్రమే ఇప్పటి వరకు జైలులో ఉన్నారు. అర్హత లేని సంస్థలకు తక్కువ ధరలకు లైసెన్సులు మంజూరు చేశారని రాజాపై ఆరోపణలున్నాయి. తాను నిర్దోషినని ఆయన కోర్టులో చెప్పుకున్నారు. తాను 2008లో విధానాన్ని అమలు చేసిన విషయం ప్రధాని మన్మోహన్ సింగ్కు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరానికి కూడా తెలుసునని ఆయన వాదించారు.
రాజా 2008లో ఇచ్చిన 122 మొబైల్ నెట్వర్క్ లైసెన్సులను సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో రద్దు చేసింది. ముందు వచ్చినవారికి ముందు విధానాన్ని పాటించడం వల్ల రాజా తనకు నచ్చిన కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడానికి ఉపయోగించుకున్నారని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డారు.