నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది: వైయస్ జగన్ వైపు సిబిఐ చూపు?
తాజాగా మంగళవారం సాయంత్రం జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిన మ్యాట్రిక్స్ ప్రసాద్ను సిబిఐ అరెస్టు చేసింది. ఆయనతో పాటే ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా అరెస్టు చేసింది. దీంతో తదుపరి అరెస్టు ఎవరిది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైన పెన్నా ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు.
ఆయన అరెస్టు తర్వాత కూడా కీలక అరెస్టుల దిశగా సిబి దృష్టి సారించిందని అంటున్నారు. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఈ నెల 12వ తేదిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనంతరం ఈ కేసుపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత నిమ్మగడ్డ అరెస్టుకు చకచకా పావులు కదిపారు. తాజా అరెస్టు తర్వాత సిబిఐ లిస్టులో పెన్నా ప్రతాప్ రెడ్డి, దాల్మియా, ఇండియా సిమెంట్స్, పివిపి బిజినెస్ వెంచర్స్, ఆర్ఆర్ గ్లోబల్ యాజమాన్యాలు ఉన్నట్లుగా సమాచారం.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వ్యక్తిగత పెట్టుబడిదారులైన జి.శ్రీనివాసరాజు, కె.శ్రీనివాస నాయుడు, అజయ్ గారపాటి, అనంతసేనా రెడ్డి, కె.ప్రసాద్ రెడ్డి, ఎంవి బావా, రాజేశ్వరి, సరోజమ్మ, శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలాలను సిబిఐ అధికారులు ఇప్పటికే రికార్డు చేశారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన విజయ సాయి రెడ్డి ఈ కేసులో ఎ-2గా ఉండగా, మ్యాట్రిక్స్ ప్రసాద్ ఎ-12గా ఉన్నారు. ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి ఇలా వరుసగా ఎ-1గా ఉన్న జగన్ అరెస్టు దిశగా సిబిఐ వడివడిగా అడుగులు వేస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.