పార్లమెంటుకు రాజా: గొంతు కలిపిన యుపి ప్రత్యర్థులు
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బద్ధ శత్రువులైన బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ ప్రజాప్రతినిధులు చేనేత కార్మికుల సమస్యపై బుధవారం రాజ్యసభలో చేతులు కలిపారు. మాటా మాటా కలిపి యుపీఏ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరప్రదేశ్లోని బనరాస్ నేత కార్మికుల దుస్థితిపై ఆ రాష్ట్రానికి చెందిన సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సభ్యులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. రాజకీయ ప్రకటనలు ఆపి కార్యాచరణ ప్రకటించాలని మూకుమ్మడిగా ఎస్పీ, బిఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీనితో సభా కార్యకలాపాలు స్తంభించాయి. సభాపతి హమీద్ అన్సారీ సభను రెండుసార్లు వాయిదా వేశారు.
తొలుత ప్రశ్నోత్తరాల సమయంలో బిఎస్పీ సభ్యుడు సలీమ్ అన్సారీ (బీఎస్పీ) బనారస్ నేత కార్మికులపై అనుబంధ ప్రశ్నను సంధించారు. బనారస్ నేత కార్మికులు తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా విక్రయించుకోవడానికి వీలుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. దీనికి టెక్స్టైల్ మంత్రి ఆనంద్ శర్మ సమాధానం చెబుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు.
ఈ సమాధానంపై బీఎస్పీకి చెందిన మరో సభ్యుడు బ్రజేష్ పాఠక్ మండిపడ్డారు. మంత్రి ఎన్నికల ఉపన్యాసం మాని వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ వెంటనే సమాజ్వాదీ పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్, బీజేపీకి చెందిన కుసుమ్ రాయ్ కూడా బ్రజేష్ పాఠక్తో జతకలిశారు. చేనేత కార్మికుల సమస్యలను కేంద్రం సీరియస్గా తీసుకోకుండా రాజకీయ ప్రకటనలతో సరిపుచ్చుతోందని వారు విమర్శించారు.
ఆ తర్వాత ఎస్పీ, బీఎస్పీ సభ్యులు వీరితో చేరి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సభ్యుల నిరసనల నేపథ్యంలో ఆనంద్ శర్మ చేనేత రంగం, చేనేత కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదని, కేవలం వారికి రుణ వితరణంలో సాయం చేస్తున్నదని వివరించారు.
అయితే మంత్రి సమాధానం పట్ల సమాధానం చెందని సభ్యులంతా ఆందోళనకు ఉపక్రమించారు. దీనితో సభను హమీద్ అన్సారీ తొలుత పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా నిరసన కొనసాగడంతో సభను సభాపతి మరోసారి మధ్యాహ్నం వరకూ వాయిదా వేశారు.